Begin typing your search above and press return to search.

2019 ఎన్నికలు.. వారసులు రెడీ

By:  Tupaki Desk   |   23 July 2018 2:30 PM GMT
2019 ఎన్నికలు.. వారసులు రెడీ
X
నూట పాతికేళ్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్తరక్తంతో ఉరకలెత్తిందుకు సమాయత్తమైంది. రాహుల్ గాంధీకి సర్వాధికారాలను అప్పగించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ కు రాహులే సేనాని అని తెలిపారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్తరక్తం ప్రవహిస్తోంది. యువత ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ రాత మార్చేందుకు రాహుల్ గాంధీ యువ నేతలను ప్రోత్సహించాలని నిర్ణయించారట.. దీంతో కాంగ్రెస్ లోని తలపండిన నేతల వారసులు ఇప్పుడు వచ్చే ఎన్నికలపై దృష్టిసారించారు. టికెట్ కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నారు. అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నారు.

కాంగ్రెసే కాదు.. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా యువనేతలకు అవకాశం ఇవ్వాలని ఈసారి డిసైడ్ అయ్యింది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ లు వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రమే పూర్తిగా మార్చేయడానికి వారసులను రంగంలోకి దింపుతున్నాయి.ఈ వారసుల ఎంట్రీతో కొత్త రాజకీయానికి అడుగులు పడుతున్నాయి.

తెలంగాణలో వారసులు తెరమీదకు వస్తున్నారు. సీనియర్ నేతలంతా వచ్చే ఎన్నికల్లో తమ వారసులను ఎన్నికల రంగంలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ సీనియర్లు తమ వారసులను ప్రజాసేవలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తన తనయుడు మిథున్ రెడ్డిని 2019 ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నాడు. షాద్ నగర్ నుంచి పోటీ చేయించే ఉద్దేశంతో జితేందర్ రెడ్డి ఉన్నాడట.. ఇప్పటికే షాద్ నగర్ లో అనేకసార్లు పర్యటిస్తూ వచ్చాడు మిథున్ రెడ్డి.

ఇక పంచాయతీరాజ్ శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తన తనయుడు అరుణ్ ను ఎన్నికల కార్యక్షేత్రంలో దించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి అరుణ్ ను పోటీచేయించాలని జూపల్లి భావిస్తున్నాడు. ఇప్పటికే అరుణ్ తండ్రికి చేదోడుగా అన్ని పనులను చక్కదిద్దుతున్నాడట..

ఇక కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి గత ఎన్నికల్లోనే తన తనయుడిని రాజకీయ అరంగేట్రం చేయించాడు. నాగర్ కర్నూల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయించారు. కానీ ఆ ఎన్నికల్లో నాగం తనయుడు శశిధర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాగం తన తనయుడికి సీటు ఇప్పించే పనిలో బిజీగా ఉన్నాడట.. అయితే శశిధర్ ప్రస్తుతం రాజకీయంగా స్తబ్ధుగా ఉన్నారు. యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

ఢిల్లీలో టీఆర్ ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్న మందాజగన్నాథం తన కుమారుడు శ్రీనాథ్ ని గత ఎన్నికల్లోనే ఆలంపూర్ నుంచి పోటీచేయించాడు. కానీ ఆ ఎన్నికల్లో శ్రీనాథ్ ఓటమి పాలయ్యాడు. అయితే మరోసారి తన తనయుడికి చాన్స్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరుతున్నాడట.. అవసరమైతే తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా సరే తన కొడుక్కి ఆలంపూర్ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నాడట..

ఇక కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కూడా తన చిన్న కుమార్తెను తెరపైకి తీసుకురావాలని యోచిస్తోందట. ఇప్పటికే నాగర్ కర్నూల్ యువజన కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు స్నిగ్ధారెడ్డి. యూత్ ఐకాన్ గా కుమార్తె స్నిగ్ధారెడ్డిని ప్రమోట్ చేసే పనిలో డీకే అరుణ ఉంది. మక్తల్ కాకుంటే ఏదో ఒక నియోజకవర్గం నుంచి స్నిగ్ధాను పోటీచేయించే యోచనలో డీకే అరుణ ఉన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు కీలక నేతలంతా తమ వారసులను రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు.. నాగం, మంద కుమారులు గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మిగతా వారసులంతా హిట్ అవుతారా లేదా అన్నది వేచిచూడాలి.