Begin typing your search above and press return to search.

ఏపీ డీజీపీ బాధ్య‌త‌ల్లో కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   24 Nov 2017 1:56 PM GMT
ఏపీ డీజీపీ బాధ్య‌త‌ల్లో కొత్త ట్విస్ట్‌
X
అనేక ట్విస్టుల ప‌రంప‌ర త‌ర్వాత‌...ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర డీజీపీ ప‌ద‌వీ బాధ్య‌త‌ల విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ప్ర‌స్తుత డీజీపీ సాంబ‌శివ‌రావుకు పూర్తి స్థాయి బాధ్య‌త‌లు ప్ర‌భుత్వం అప్ప‌గించింది. ప్ర‌స్తుతం ఏపీ ఇన్‌చార్జ్ డీజీపీగా కొన‌సాగుతున్న సాంబ‌శివ‌రావుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీగా పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, డీజీపీ నియామకంపై ఎంపిక కోసం బుధవారం ఢిల్లీలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. కేం‍ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బిన్నభిప్రాయాలు రావడంతో యూపీఎస్సీ కమిటీ సమావేశం వాయిదా పడిందని ప్ర‌చారం జ‌రిగింది.

దాదాపు 16 నెలలుగా ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా సాంబశివరావు వ్యవహరిస్తున్నారు. ఆయన డిసెంబర్‌ నెలాఖరులో సాంబశివరావు పదవీ విరమణ చేయనున్నారు. అయితే సాంబశివరావు కొనసాగింపునకే సీఎం చంద్రబాబు ఆసక్తి చూపుతున్నార‌నే వార్త‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. దీన్ని నిజం చేసేలా జాబితా పంపించారు. అయితే నవంబరు మొదటి వారంలో రాష్ట్రం పంపిన ఐపీఎస్‌ జాబితాలో కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేసే ప్రస్తుత ఇన్ఛార్జి డీజీపీ సాంబశివరావు, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యల పేర్లు ఉండటంతో కేంద్రం తిప్పి పంపింది. దీనితో ప్రకాష్‌ సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసును ఉదహరిస్తూ మళ్లీ అదే జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినట్లు సమాచారం. రెండోసారి జాబితానూ తిప్పి పంపినట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో డీజీపీ ఎంపిక అన్ని విధాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. జాబితా తిర‌స్క‌ర‌ణ‌ పరిణామాలను పరిశీలిస్తే డీజీపీ ఎంపికలో తమ పాత్ర ఉండేలా కేంద్రం జాగ్రత్త పడుతున్నట్లు అర్థమవుతోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపిక వ్యవహారంలో కేంద్రం తీరుపై కొందరు రాష్ట్ర పెద్దలూ అసహనంతోనే రాష్ట్ర వ్యవహారాల్లో ఇంతలా కేంద్రం జోక్యం చేసుకోవడం సమాఖ్య సూర్తిని ఉల్లంఘించడమేనని రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు ప‌లు సంద‌ర్భాల్లో స‌న్నిహితుల‌తో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆలస్యం కూడా ఇప్పుడు ఇబ్బందులు తెస్తోంది. ఐపీఎస్‌ల మధ్య చీలికకూ కారణమయ్యిందనే విమర్శలొచ్చాయి. గతంలో ఉత్త‌రాదికి చెందిన ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను డీజీపీ నియమించినప్పుడు ఎటువంటి వివాదాలు లేవని ప్ర‌చారం సాగింది. అయితే ఇప్పుడు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోలేక‌పోవ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని ప‌లువురు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత డీజీపీ సాంబశివరావుతో పదవీ విరమణ చేస్తే డీజీపీ రేసులో ఠాకూర్‌, కౌముదిలు ఉంటారని అంచ‌నావేశారు.