Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రివ‌ర్గం...కొత్త మొఖాలు ఇవేనా?

By:  Tupaki Desk   |   19 Feb 2017 5:48 AM GMT
ఏపీ మంత్రివ‌ర్గం...కొత్త మొఖాలు ఇవేనా?
X
సుదీర్ఘంగా వార్త‌ల్లోనే న‌లుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైందని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. టీడీపీ వ‌ర్క్ షాప్ అనంత‌రం ఈ మేర‌కు క్లారిటీ వ‌చ్చింద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు చెప్తున్నాయి. పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా చేపట్టనున్న ఈ విస్తరణలో కీలక మార్పులు చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న చంద్రబాబు అందుకు అనుగుణంగానే యువతతోపాటు పార్టీలో సీనియర్‌ నేతల అనుభవానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. అదే టైంలో పార్టీలో అవినీతి ఆరోపణలు - అలసత్వం - శాఖాపరంగా ఇంకా పట్టు సాధించలేని వారిని మంత్రివర్గం నుంచి తొలగించనున్నట్లు తెలిసింది. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఇది మొద‌లవుతుంద‌ని అంటున్నారు. ఈ పోరులో చ‌క్క‌టి ప‌నితీరును క‌న‌బ‌ర్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంద‌ని కూడా చెప్తున్నారు.

వివిధ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న మంత్రుల్లో ఏడుగురికి ఉద్వాసన ఖాయమని అంటున్నారు. కొత్తగా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కేబినెట్‌ నుంచి ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కిమిడి మృణాళిని - పీతల సుజాత - కొల్లు రవీంద్ర - పత్తిపాటి పుల్లారావు - రావెల కిశోర్‌ బాబు - బొజ్జల గోపాలకృష్ణారెడ్డి - పల్లెరఘునాథరెడ్డిలను తొలగించనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం క్యాబినెట్‌ లో ఉన్న మంత్రుల్లో గుబులు మొదలైంది. కాగా, కొత్త అవకాశాలు ఎవ‌రిక‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్ర నెల‌కొంది. వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ తో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావు (శ్రీకాకుళం) - వంగలపూడి అనిత (విశాఖపట్నం) - గొల్లపల్లి సూర్యారావు (తూర్పు గోదావరి) - మహ్మద్‌ షరీఫ్‌ (పశ్చిమగోదావరి) - బోండా ఉమా మహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్‌) - యరపతినేని శ్రీనివాసరావు (గుంటూరు) - అనగాని సత్యప్రసాద్‌ (గుంటూరు) - సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి (నెల్లూరు) - పయ్యావుల కేశవ్‌ (అనంతపురం) - ఈ లిస్టుతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధ రాఘవరావును తప్పిస్తే అదే సామాజిక వర్గం నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు కూడా ఛాన్స్ ఇవ్వవచ్చని అంటున్నారు. వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో సుజయ కృష్ణారంగారావు, గొట్టిపాటి రవికుమార్‌, భూమా నాగిరెడ్డి లేదా భూమా అఖిల ప్రియ,కొత్త జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ పదవీ కాలం ఇప్పటికే సగం పూర్తయింది. మంత్రివర్గం ఏర్పడి వచ్చే జూన్‌ నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. 2019లో జరిగే ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనే బృందాన్ని ఎంచుకోటానికి ఇదే సరైన సమయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు ఇప్పటికే ఒకటి, రెండు సందర్భాల్లో చంద్రబాబు పేర్కొన్నారు. ఆశించిన స్థాయిలో పనితీరు కనపరచని వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో మంత్రివర్గ విస్తరణ కూర్పులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని మంత్రులు ఎదురుచూస్తున్నారు.

మ‌రోవైపు మంత్రివ‌ర్గ మార్పులు చేర్పులు అంత ఈజీగా తేలిపోయే విష‌యం లాగా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినా దీనికి సంబంధించి అడ్డంకులు ఎదురవుతున్నట్లు సమాచారం. మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటున్న శాసనసభ్యుల్లో కొందరి పేర్లపై పీటముడి పడటమే దీనికి కారణమని అంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారి పేర్ల పరిశీలనలోనే పార్టీపరంగా ఈవిధమైన ఇబ్బంది ఎదురవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కర్నూలు జిల్లా విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు పార్టీ వర్గాల కథనం.వైకాపా నుంచి పార్టీలో చేరిన కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునే ఉద్దేశంతో అక్కడ ఆయనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలోని శిల్పా బ్రదర్స్‌కి నచ్చజెప్పేందుకు కొద్దిరోజులుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ పెద్దలు పలువురు ఇప్పటికే వారితో భేటీ అయ్యారు. వారు మెత్తపడక పోవటంతో అడుగు ముందుకుపడలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం జరగటంతో ఆ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల్ని కలిసి ఆయనను తీసుకోవద్దని కోరినట్లు సమాచారం. మంత్రివర్గంలో మార్పు, చేర్పుల ప్రభావం కృష్ణా, కడప, విశాఖపట్నం వంటి జిల్లాలు మినహా అన్నింటిపైనా ఏదో ఒక రూపంలో ఉండేలా కనిపిస్తోంది. అందరికి నచ్చజెప్పి ఏకాభిప్రాయంతోనే వారిలో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని బాబు భావిస్తుండటంతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి శాసనమండలి ఎన్నికలు, శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తరువాతే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరుగుతాయేమోనని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/