Begin typing your search above and press return to search.

ఇప్పుడు త‌మిళ‌నాడులో ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   18 April 2017 8:19 AM GMT
ఇప్పుడు త‌మిళ‌నాడులో ఏం జ‌రుగుతోంది?
X
నిన్న‌టి వ‌ర‌కూ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మామూలుగా ఉన్న‌ట్లే క‌నిపించినా.. ఈ రోజు ఉద‌యం పేప‌ర్లు చూసేస‌రికి.. ఏదో జ‌రిగిపోతుంద‌న్న భావ‌న క‌లుగ‌జేసింది. సోమ‌వారం రాత్రి చ‌క‌చ‌కా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు ఉద‌యం నుంచి వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తోపాటు.. ప‌లు మీడియా సంస్థ‌లు ఇస్తున్న వార్త‌ల నేప‌థ్యంలో అస‌లేం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అన్నాడీఎంకేలో అంత‌ర్గ‌తంగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. రెండుగా చీలిపోయిన వ‌ర్గాలు ఇప్పుడు ఏకం కానున్నాయ‌న్న‌ది ఒక వార్త ఆస‌క్తిక‌రంగా మారింది. అదే స‌మ‌యంలో.. ఇలాంటి ప‌రిణామాల‌కు జైల్లో ఉన్న చిన్న‌మ్మ ఒప్పుకుంటారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

చిన్న‌మ్మకు కొడుకు వ‌ర‌సైన దిన‌క‌ర‌న్ చుట్టూ పార్టీ గుర్తు కోసం లంచం ఆఫ‌ర్ చేశార‌న్న ఉచ్చు బిగుస్తున్న వేళ‌లోనే.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి.. మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్‌ సెల్వం ఇద్ద‌రూ చేతులు క‌లిపిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో పార్టీ నుంచి దిన‌క‌ర్‌ ను.. చిన్న‌మ్మ‌ను త‌రిమి కొట్టాల‌న్న ప్లానింగ్‌ లో పళ‌ని.. ప‌న్నీర్ వ‌ర్గాలు వ‌చ్చిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌కు తగ్గ‌ట్లే కొత్త వార్త‌లు వినిపిస్తున్నాయి.

వీటిల్లో విశ్వ‌స‌నీయత ఎంత‌? జ‌రిగేది ఎంత‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు వినిపిస్తున్న అంశాల్ని చూస్తే..

1. పార్టీలో చోటు చేసుకున్న మార్పుల‌తో దిన‌క‌ర‌న్ కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం పార్టీ ఉప కార్య‌ద‌ర్శిగా ఉన్న దిన‌క‌ర‌న్ తాజా ఎపిసోడ్ లో కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం త‌న ద‌గ్గ‌రి ప‌ద‌విని వ‌దులుకోవ‌టానికి సిద్ధ‌మ‌ని.. కానీ.. చిన్న‌మ్మ‌ను మాత్రం పార్టీ చీఫ్ గా ఉండాల‌ని ఆయ‌న చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

2. ప‌న్నీర్ వ‌ర్గంలో క‌లిసేందుకు దిన‌క‌ర‌న్ సుముఖంగా ఉన్న‌ట్లుగా చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. విలీన చ‌ర్చ‌ల్ని ఆయ‌న స్వాగ‌తించిన‌ట్లుగా చెబుతున్నారు. బెంగ‌ళూరు నుంచి చెన్నైకి వ‌చ్చిన దిన‌క‌ర‌న్ తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించి.. అంద‌రూ క‌లిసి ఉండాల‌నే తానుకోరుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

3. మ‌రోవైపు శ‌శిక‌ళ కుటుంబాన్ని పార్టీకి.. ప్ర‌భుత్వానికి దూరం పెడితేనే విలీనానికి సిద్ధ‌మ‌ని ప‌న్నీర్ సెల్వం ష‌ర‌తు పెట్టిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌కు స్పీక‌ర్ ప‌ద‌వి కానీ.. మంత్రి ప‌ద‌వి కానీ ఇస్తామ‌న్న ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఆఫ‌ర్‌ కు నో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. సీఎం ప‌ద‌వి త‌ప్పించి.. మ‌రే ప‌ద‌వి త‌న‌కు అక్క‌ర్లేద‌ని ప‌న్నీర్ స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

4. ప‌ళ‌ని వ‌ర్గంలో క‌లిసిపోయేందుకు అవ‌స‌ర‌మైన విధానాల్ని రూపొందించేందుకు తొమ్మిది మంది స‌భ్యుల‌తో కూడిన ఒక క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని ప‌న్నీర్ సెల్వం భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ క‌మిటీలో ప‌న్నీర్ సెల్వం కూడా ఒక స‌భ్యుడిగా ఉండ‌నున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే మంత్రి సెంగొట్టియ‌న్ మాట్లాడుతూ.. రెండు వ‌ర్గాలు క‌లిసేందుకు వీలుగా ఒక‌క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు.

5. రెండు వ‌ర్గాల మ‌ధ్య విలీనానికి ప‌న్నీర్ వ‌ర్గం ఎలాంటి ష‌ర‌తులు పెట్ట‌లేదంటూ మంత్రి సెంగొట్టియ‌న్ వ్యాఖ్యానించ‌గా.. దీనికి కౌంట‌ర్ గా ప‌న్నీర్ సెల్వం తాజాగా మీడియాతో మాట్లాడారు. తాము ష‌ర‌తులు పెట్ట‌లేద‌ని చెప్ప‌టం అవాస్త‌వ‌మ‌ని.. తాము ష‌ర‌తులు పెట్టిన‌ట్లుగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/