Begin typing your search above and press return to search.

బాబుకు ఝ‌ల‌క్ ఇస్తున్న పార్టీ సీనియ‌ర్లు

By:  Tupaki Desk   |   30 Aug 2016 5:30 PM GMT
బాబుకు ఝ‌ల‌క్ ఇస్తున్న పార్టీ సీనియ‌ర్లు
X
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ - కాంగ్రెస్‌ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు జ‌రిగాయి. అయితే ఇలా సైకిల్ ఎక్కిన వారికి పెద్ద పీట ద‌క్కుతుండ‌టంతో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభ‌మైంది. ఏకంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరం కావ‌డం మొద‌లుపెట్టారు. ఇదంతా పదేళ్లపాటు కష్టాల్లో ఉన్న సమయంలో పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచిన నాయకులతోపాటు జెండా మోసిన వారికి నష్టం జరుగుతుందన్న అసంతృప్తి వ‌ల్లే కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా తెదేపా ఆత్మకూరు బాధ్యతలు ఆనం రామనారాయణ రెడ్డికి అప్పగించ‌డం మ‌రింత చిచ్చు రేపుతోంది.

పదేళ్లపాటు ప్రతిపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో నెల్లూరు జిల్లాలో పార్టీకి పూర్వవైభవం వచ్చింది. అప్పటి వరకూ పార్టీ కోసం కష్టపడ్డ వారంతా ఆశావాహులుగా మారారు. వారి ఆశలను రెట్టింపు చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం జిల్లాకు వచ్చిన ప్రతి సారీ పార్టీకి అండగా ఉన్నవారిని మర్చిపోమని, వారికి తగిన గుర్తింపుతోపాటు నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీలు ఇచ్చారు. దీంతో అందరూ పదవులపై ఆశలు పెంచుకున్నారు. గత ఎన్నికల్లో ఉదయగిరి - కోవూరు - వెంకటగిరి నియోజకవర్గాలను మాత్రమే పార్టీ గెలుచుకోగలిగింది. ఇక మిగిలిన ఆత్మకూరు - కావలి - నెల్లూరు నగరం - గ్రామీణం - గూడూరు - సూళ్లూరుపేట - సర్వేపల్లి నియోజకవర్గాలను వైకాపా సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓడిపోయిన ఆయా నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసి 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్లా విజయకేతనం ఎగురవేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా జిల్లాపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాకు ఓ మంత్రిని - మరో ఇన్‌ ఛార్జి మంత్రిని - ఇద్దరు ఎమ్మెల్సీ పదవులను కూడా ఇచ్చారు.

అయితే వ‌ల‌సల ఎఫెక్ట్ టీడీపీకి ఘాటుగా త‌గులుతోంది. ఎనిమిది నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆనం సోదరులు తెదేపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధ‌మ‌వ‌గా తెదేపాలో ఓ వర్గం వ్యతిరేకించింది. అయితే పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణయం మేరకు ఎవరూ నోరు మెదపలేదు. తరువాత గూడూరు వైకాపా ఎమ్మెల్యే పాశం సునిల్‌ కుమార్‌ పార్టీలో చేరడంతో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జోత్స్నలత పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది. తాజాగా నాలుగు రోజుల క్రితం ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు ఇన్‌ ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవడంతో నియోజకవర్గంలో, జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ వచ్చిన ఆత్మకూరు ఇన్‌ ఛార్జి మురళి కన్నబాబు పరిస్థితి కూడా ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమైంది. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. రెండున్నరేళ్లుగా పలు అభివృద్థి కార్యక్రమాలు చేపట్టారు. నీరు-చెట్టు కార్యక్రమం అమలులో ఆత్మకూరు నియోజకవర్గం జిల్లాలో ప్రథమ స్థానం - రాష్ట్రస్థాయిలో మొదటి పదింటిలో ఒకటిగా నిలిచింది. ఇంతలోపే కన్నబాబును ఇన్‌ ఛార్జిగా తప్పించి ఆనం రామనారాయణరెడ్డికి పగ్గాలు అప్పగించడంతో నియోజకవర్గంలోని ఓ వర్గం కొంత అసంతృప్తి తో ఉన్నట్లు తెలిసింది.

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు ఇన్‌ ఛార్జిగా నెల్లూరు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ఆర్భాటంగా చేప‌ట్ట‌గా నెల్లూరు నగరం - గ్రామీణం - ఆత్మకూరు - ఇతర నియోజకవర్గాల నుంచి అభిమానులు - నాయకులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఇన్‌ ఛార్జులు - జిల్లా - నగర - అనుబంధ సంఘాల నాయకులు - కార్పొరేటర్లకు ఆహ్వానం పంపారు. కొందరికి స్వయంగా ఆయన - ఆయన కుటుంబ సభ్యులు - వివేకానందరెడ్డి ఫోన్లు చేసి పిలిచారు. ఈ క్రమంలో కన్నబాబును కూడా ఆహ్వానించారు. అయితే ఆయన కార్యక్రమానికి హాజరు రాలేదు. చివరికి ఆయన వర్గం కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌ రెడ్డి - మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ తాళ్లపాక అనురాధలకు మాత్రం ఆనం సోదరులు ఆహ్వానం పంపలేదు. దీంతో వారూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.