Begin typing your search above and press return to search.

భాయ్ అంటే భ‌యం లేదా?.. ఖ‌తం చేయాలా?

By:  Tupaki Desk   |   10 Aug 2017 6:08 AM GMT
భాయ్ అంటే భ‌యం లేదా?.. ఖ‌తం చేయాలా?
X
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా పోలీసులు.. రాజ‌కీయ నేత‌ల అండ‌తో ఎదిగిన క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్ నయిం ఎన్ కౌంట‌ర్లో హ‌త‌మై ఏడాది దాటింది. అయిన‌ప్ప‌టికీ అత‌డి మూలాలు మాత్రం ఇంకా పోలేదు. తాజాగా న‌యిం భాయ్ అనుచ‌రుల‌మంటూ ఒక వ్యాపార‌వేత్త‌ను బెదిరించిన వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది. న‌యిం పేరుతో దందా ఇంకా కొన‌సాగుతుంద‌న్న విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైద‌రాబాద్‌ కు చెందిన వీరేశం అనే వ్యాపార‌వేత్త‌ను నయిం గ్యాంగ్ బెదిరిస్తున్న వైనం ఇప్పుడు పోటీసుల దృష్టికి వ‌చ్చింది. భువ‌న‌గిరి భాయ్ పేరు చెబితే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందేన‌ని.. న‌యిం గ్యాంగ్ త‌మ‌కు ఫోన్ ద్వారా బెదిరించిన‌ట్లుగా బాధితులు చెబుతున్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్ లోని టీఎన్జీవో కాల‌నీలోని భూమిని త‌మ పేరు మీద బ‌దిలీ చేయాల‌ని డిమాండ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వంలో విద్యాసాగ‌ర్ అనే వ్య‌క్తి కీల‌క‌మ‌ని.. ఎమ్మెల్యేలు.. పోలీసులు.. అధికారుల్ని మార్చ‌గ‌ల‌డ‌ని.. ఆయ‌న భార్య వ‌స్తుంద‌ని చెప్పిన న‌యిం గ్యాంగ్‌.. ఆ భూమిని ఆమె పేరు మీద బ‌దిలీ చేయాల‌ని బెదిరించారు. విద్యాసాగ‌ర్ పేరు చెప్పినా ప‌ట్టించుకోవా? అంటూ బెదిరించిన వారు.. భూమిని బ‌దిలీ చేయ‌కుంటే రూ.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌న్న డిమాండ్ చేశారు. ఒక‌వేళ త‌మ మాట‌ల్ని ప‌ట్టించుకోక‌పోతే ఐదు నిమిషాల్లో లేపేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. దీంతో హ‌డ‌లిపోయిన బాధితుడు పోలీసుల్ని ఆశ్ర‌యించారు. ఫోన్లో త‌మ‌ను బెదిరించిన వైనాన్ని రికార్డు చేసిన బాధితుడు మైలార్ దేవ్ ప‌ల్లి పోలీసుల్ని ఆశ్ర‌యించారు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు నిజంగానే భాయి అనుచ‌రులే ఈ దందాకు తెర తీశారా? లేక న‌యిం పేరుతో ఎవ‌రైనా ఇలాంటి ప‌నులు చేస్తున్నారా? అన్న కోణంలో విచారిస్తున్నారు.