Begin typing your search above and press return to search.

జీఎస్టీ స‌మ‌ష్టి నిర్ణ‌యం.. ఒక్క‌డిదే కాదు!

By:  Tupaki Desk   |   17 Oct 2017 4:20 AM GMT
జీఎస్టీ స‌మ‌ష్టి నిర్ణ‌యం.. ఒక్క‌డిదే కాదు!
X
`దేశ వ్యాప్తంగా ఒకే ప‌న్ను విధానం అమ‌లులోకి తీసుకొస్తున్నాం.. దేశ ఆర్థిక చ‌రిత్ర‌లో ఇదో అద్భుత‌మైన రోజు` అని జీఎస్టీని ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో బీజేపీ నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. కేంద్రానికి మ‌ద్ద‌తుగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా జీఎస్టీకి ఆమోద‌ముద్ర వేశాయి. అయితే అనుభ‌వం అయితేగాని త‌త్వం బోధ ప‌డదు అన్న చందంగా జీఎస్టీ వల్ల ఇప్పు డు రాష్ట్రాల ఆర్థిక స్థితి దారుణంగా ప‌డిపోయింద‌ని గగ్గోలు పెడుతున్నారు. ఇక ఆర్థిక వేత్త‌లు కూడా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గించింద‌ని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కూడా జీఎస్టీనే టార్గెట్ చేస్తూ బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీనికి ప్ర‌ధాని మోదీ కౌంట‌రిచ్చారు. జీఎస్టీ తానొక్కడినే తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని.. కాంగ్రెస్ కూడా మ‌ద్ద‌తిచ్చింద‌ని తెలిపారు.

గుజ‌రాత్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో.. ప్ర‌ధాని మోదీ రాష్ట్రమంత‌టా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. నోట్ల‌ర‌ద్దు వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు పడ్డార‌ని - ఇప్పుడు తీసుకొచ్చిన జీఎస్టీ వ‌ల్ల ఆర్థిక ప్ర‌గ‌తి కుంటుప‌డుతోంద‌ని తీవ్రంగా దుయ్య‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఆ వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పుగా వస్తు - సేవల పన్ను(జీఎస్టీ) అమలులోకి తేవడం తాను ఒంటరిగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టంచేశారు.

ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కావడం వల్లే నోట్లరద్దు - జీఎస్టీ ప్రయోగాలు వైఫల్యం చెందాయన్న విమర్శకులకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. గుజరాత్‌ లోని గాంధీనగర్‌లో నిర్వహించిన సభలో ఆయ‌న మాట్లాడుతూ.. `జీఎస్టీ నిర్ణయం నా ఒక్కడిదికాదు. కాంగ్రెస్‌ తోపాటు దాదాపు 30 రాజకీయ పార్టీలు మద్దతు పలకడం వల్లే చట్టం రూపొందింది. ఈ విషయాన్ని విస్మరించిన కొందరు నన్ను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీపై దుష్ప్రచారం చేస్తోంది. మతతత్వం - వర్గవిభేదాలు - ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ లక్ష్యాలు. యూపీఏ పాలనలో ఎలాంటి ప్రగతి సాధించలేని కాంగ్రెస్ నేతలు.. నేడు బీజేపీ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకపోతున్నార`ని మోదీ నిప్పులు చెరిగారు.