Begin typing your search above and press return to search.

విస్త‌ర‌ణ ముహుర్తం?:పండ‌క్కి ముందా..త‌ర్వాతా?

By:  Tupaki Desk   |   22 Aug 2017 10:16 AM GMT
విస్త‌ర‌ణ ముహుర్తం?:పండ‌క్కి ముందా..త‌ర్వాతా?
X
గ‌డిచిన కొంత‌కాలంగా కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అప్పుడు.. ఇప్పుడు అంటూ ప‌లు తేదీల్ని పేర్కొంటూ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా.. అలాంటి వాటికి పుల్ స్టాప్ ప‌డిన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే.. దీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల్లో న‌డుస్తున్న కేంద్ర‌మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌.. వినాయ‌క‌చ‌వితికి ముందు కానీ త‌ర్వాత కానీ ప‌క్కా అని చెబుతున్నారు.

జేడీయూ.. అన్నాడీఎంకేలో నెల‌కొన్ని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాలు ఒక కొలిక్కి రావ‌టంతో మోడీ విస్త‌ర‌ణ ముహుర్తం దాదాపుగా కన్ఫ‌ర్మ్ అయిన‌ట్లేన‌ని చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ నెల 24 కానీ.. 26 కానీ విస్త‌ర‌ణ జ‌రిగే వీలుంద‌ని చెబుతున్నారు. తాజా విస్త‌ర‌ణ‌లో జేడీయూ.. అన్నాడీఎంకేల‌కు మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో చోటు ల‌భించే వీలుంద‌ని తెలుస్తోంది.

ఈ కార‌ణంతోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా త‌న త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌ను తాజాగా మ‌రోసారి క్యాన్సిల్ చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి తుది జాబితా మీద మోడీ.. అమిత్ షాలు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తాజా విస్త‌ర‌ణ‌లో అన్నాడీఎంకేకు రెండు కేబినెట్‌.. రెండు స‌హాయ‌మంత్రి ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇక‌.. ఈ మ‌ధ్య‌నే బీజేపీతో జ‌త క‌ట్టిన జేడీయూకు ఒక కేబినెట్‌.. ఒక స‌హాయ‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌టం ఖాయ‌మంటున్నారు. 2019 ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొని జ‌ర‌గ‌నున్న ఈ విస్త‌ర‌ణ‌లో ఇప్ప‌టికే ప‌ని తీరు స‌రిగా లేద‌న్న భావ‌న‌లో ఉన్న కొంద‌రికి ఉద్వాస‌న ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇలా సాగ‌నంపే వారి నుంచి అసంతృప్తి వ్య‌క్తం కాకుండా ఉండేందుకు వీలుగా వారిని ప‌లు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్లుగా పంపే వీలుంద‌ని చెబుతున్నారు.

మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఏమిటంటే.. క్యాబినెట్ లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. బీహార్ ల‌కు ప్రాధాన్య‌త త‌గ్గించి.. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రిగే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. క‌ర్ణాట‌క నుంచి మంత్రివ‌ర్గంలోకి అవ‌కాశాలు ద‌క్కే అవ‌కాశం ఉందంటున్నారు. ఇప్ప‌టిదాకా లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నతంబిదురైకి ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ల‌భిస్తుంద‌ని.. అదే స‌మ‌యంలో శివ‌సేన ఎంపీ ఆనంద‌రావ్ అడుసుకు డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. శివ‌సేన నుంచి అనిల్ దేశాయ్‌.. టీడీపీ నుంచి సీఎం ర‌మేశ్‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కే వీలున్న‌ట్లు చెబుతున్నారు. ఎపీ బీజేపీ కోటాలో విశాఖ ఎంపీ హ‌రిబాబుకు మంత్రివ‌ర్గంలో ఛాన్స్ ల‌భించటం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఈ అంచ‌నాలు ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది.. అధికారిక స‌మాచారం వెల్ల‌డైన త‌ర్వాతే తెలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.