Begin typing your search above and press return to search.

హోదాపై మోడీ కుట్ర బ‌య‌ట‌కు వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:59 AM GMT
హోదాపై మోడీ కుట్ర బ‌య‌ట‌కు వ‌చ్చేసింది
X
విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకునేందుకు ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ లోక్ స‌భ‌లో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌టం తెలిసిందే. హోదా అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చింది నాటి విప‌క్షం.. నేడు అధికార‌ప‌క్ష‌మైన బీజేపీనే. ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ నోటి మాటగా ప్ర‌త్యేక హోదా మీద‌ మాట‌ను చెప్పినప్ప‌టికి.. సాంకేతిక అంశాల కార‌ణంగా విభ‌జ‌న బిల్లులో ఆ అంశాన్ని చేర్చ‌లేదు. ఇదిలా ఉంటే.. విభ‌జ‌న అనంత‌రం ఏపీకి ఇవ్వాల్సిన హోదాపై తొండాట మొద‌లైంది.

విభ‌జ‌న జ‌రిగాక‌.. మోడీ స‌ర్కారు కొలువు తీరాక‌.. కొన్ని రోజుల‌కు హోదా మీద డిమాండ్లు అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ‌.. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్ద‌ని సిపార్సు చేసింద‌ని.. అందుకే న‌వ్యాంధ్ర‌కు హోదా ఇచ్చేది లేద‌ని తేల్చింది. మోడీ స‌ర్కారు నిర్ణ‌యం పుణ్య‌మా అని ప్ర‌త్యేక హోదా తో వ‌చ్చే ప్ర‌యోజ‌నాల‌న్ని గాల్లోకి క‌లిసిపోయాయి.

అయితే.. ప్ర‌త్యేక హోదాతో వ‌చ్చే లాభాల్ని ప్ర‌త్యేక ప్యాకేజీ తో స‌ర్దుబాటు చేస్తామ‌ని చెప్పి అట‌కెక్కించేశారు.

అలా ఎలా చెబుతార‌న్న మాట‌ను గ‌ట్టిగా అడిగితే.. కొత్త‌గా మ‌రే రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దంటూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింద‌ని.. అందుకే ఏపీకి హోదా ఇవ్వ‌ట్లేద‌ని తేల్చేశారు.

అంతేకాదు.. ఇప్ప‌టికే హోదా స్టేట‌స్ ఉన్న రాష్ట్రాల‌కు దాన్ని తీసేస్తామ‌ని.. త్వ‌ర‌లో తీసేసే హోదాను ఏపీకి కొత్త‌గా ఎలా ఇస్తామంటూ మాట్లాడ‌టం మొద‌లెట్టారు. దారుణ‌మైన విష‌యం ఏమిటంటే. హోదా అన్న‌దే ఉండ‌ద‌న్న మోడీ స‌ర్కారు ఆ మ‌ధ్య‌న హోదా ఉన్న రాష్ట్రాల‌కు హోదా స్టేట‌స్ ను మ‌ళ్లీ మ‌రోసారి పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. నిజానికి ఈ నిర్ణ‌యాన్ని తెలుగు మీడియా పెద్ద ఎత్తున ఫోక‌స్ చేయాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. దీంతో.. మోడీ స‌ర్కారు తీసుకున్న కీల‌క నిర్ణ‌యం సింగిల్ కాల‌మ్ గా దిన‌ప‌త్రిక‌ల్లో అచ్చు కావ‌టంతో జనం మ‌దిలో రిజిస్ట‌ర్ కాలేదు.

తాజాగా మోడీ కుట్ర ఒక ఇంట‌ర్వ్యూ రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది. మోడీ అండ్ కో చెప్పిన‌ట్లుగా ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాను ఎవ‌రూ అడ్డుకోలేద‌ని.. ఆర్థిక సంఘం అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు ప్ర‌ధాన మంత్రి ఆర్థిక స‌ల‌హామండ‌లి స‌భ్యుడు.. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఫైనాన్స్ అండ్ పాల‌సీ డైరెక్ట‌ర్ ఎం గోవింద‌రావు.

తాజాగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆంధ్రోళ్లు ఉలిక్కిప‌డేలా.. షాక్ తినేలా ఆయ‌న కొన్ని అంశాల్ని చెప్పారు. ఒక రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కూడ‌ద‌ని తాము ఆంక్ష‌లు పెట్ట‌లేద‌ని.. అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌లేదంటూ కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు. కేంద్రం త‌లుచుకుంటే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వొచ్చ‌న్న మాట‌ను చెప్పేశారు.

హోదాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే..

"ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు. ప్రత్యేక హోదా కల్పించడమనేది కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక నిర్ణయం. ఆర్థిక సంఘానికి దానితో ఏ సంబంధమూ లేదు. రాజ్యాంగంలో ప్రత్యేక కేటగిరీ హోదా అనేది లేదని.. తమకు ప్రతి రాష్ట్రమూ ప్రత్యేకమేనని మాత్రమే ఆర్థిక సంఘం చెప్పింది. మేము ఒక ప్రామాణిక పద్ధతిలో ప్రతి రాష్ట్రం రెవెన్యూ సామర్థ్యాన్ని, వ్యయ అవసరాలను లెక్కించాలని ప్రతిపాదించాం.ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించే పద్ధతిని కొనసాగించొద్దని ఆర్థిక సంఘం ప్రతిపాదించిందనడం పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే" అంటూ అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించారు. ఏపీకి హోదా విష‌యంలో మోడీ స‌ర్కారు ఎంత‌గా మాయ చేసిందో గోవింద‌రావు మాట‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. మ‌రిప్ప‌టికైనా త‌మ‌కు జ‌రిగిన అన్యాయం మీద సీమాంధ్రులు గ‌ళం విప్పుతారా? ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌రిగిన భారీ న‌ష్టం గురించి అటు అధికార‌పక్షం.. ఇటు విప‌క్షం గ‌ళం విప్పాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రిప్ప‌టికైనా త‌మ మొద్దునిద్ర‌ను పాల‌కులు.. ప్ర‌తిప‌క్ష నేత‌లే కాదు.. ఆంధ్రోళ్లు కూడా వ‌దిలించుకోవాల్సి ఉంది. న్యాయ‌మైన హ‌క్కును పోరాడి సాధించుకోవాల్సి ఉంది. అంత పోరాటానికి సీమాంధ్రులు సిద్ధ‌మేనా?