Begin typing your search above and press return to search.

మోడీ రాముండంటున్న జ‌శోదాబెన్‌

By:  Tupaki Desk   |   21 Jun 2018 11:23 AM GMT
మోడీ రాముండంటున్న జ‌శోదాబెన్‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వివాహం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. మోడీ ఒక‌నాటి క్యాబినెట్ స‌హ‌చ‌రురాలు చేసిన కామెంట్ల‌తో...ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ తెర‌మీద‌కు రావాల్సి వ‌చ్చింది. గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి ప్ర‌స్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న‌ ఆనందీబెన్ పటేల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీకి వివాహం కాలేదు. ఆయనకు భార్య - పిల్లలు లేనప్పటికీ.. మహిళలను - పిల్లల బాధను అర్థం చేసుకోగలరని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జ‌శోదాబెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీకి పెళ్లికి కాలేదని ఆనందీబెన్ చెప్పడం సరికాదన్నారు. ఆనందీబెన్ వ్యాఖ్య‌లు త‌న‌ను తీవ్ర కలత చెందించాయ‌ని జశోదాబెన్ వ్యాఖ్యానించారు.

ఓ టీవీ చాన‌ల్‌ తో జ‌శోదాబెన్ మాట్లాడుతూ ``మోడీ బాధ్యతయుతమైన వ్యక్తి అని.. ఆయన తనకు రాముడు లాంటి వ్యక్తి. 2004 లోక్‌ సభ ఎన్నికల్లో మోడీనే స్వయంగా తనను పెళ్లి చేసుకున్నట్లు నామినేషన్‌ లో తెలిపారు.`` అనిజశోదాబెన్ గుర్తు చేశారు. ఉన్నత విద్యావంతురాలైన ఆనందీబెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నరేంద్ర మోడీకి పెళ్లైందని అందరికీ తెలుసు, అయినా జనం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని జశోదాబెన్ కలత చెందారు. ఆనందీబెన్ మాటలు పూర్తిగా అవాస్తవం అని జశోదాబెన్ - ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా, మోడీ ప్రధాని పీఠం అధిరోహించడానికి కొన్ని రోజుల ముందే ఆయన భార్య జ‌శోదాబెన్‌ పటేల్‌ గురించి అన్ని టీవీ చానెల్స్‌లో ప్రచారం జరిగింది. ఆ సమయంలో కొన్ని టీవీ చానెల్స్‌ యశోదాబెన్‌ను ఇంటర్వ్యూ కూడా చేశాయి. ఆ సమయంలో జ‌శోదాబెన్‌ తనకు, మోడీకి వివాహం అయ్యిందని కానీ వృత్తిపరమైన బాధ్యతల వల్లే తాము వేర్వేరుగా ఉంటున్నామని కూడా యశోదాబెన్ తెలిపారు.