Begin typing your search above and press return to search.

హ‌ర్వ‌ర్డ్ కంటే హార్డ్ వ‌ర్క్ మేలు అంటున్న మోడీ

By:  Tupaki Desk   |   1 March 2017 5:59 PM GMT
హ‌ర్వ‌ర్డ్ కంటే హార్డ్ వ‌ర్క్ మేలు అంటున్న మోడీ
X
రూ.500, రూ.1000 నోట్ల ర‌ద్దును విమ‌ర్శించిన నోబెల్ గ్ర‌హీత‌, ఆర్థిక‌వేత్త అమ‌ర్త్యసేన్‌కు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కౌంట‌ర్ ఇచ్చారు. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకున్న అమ‌ర్త్య‌సేన్ ను పరోక్షంగా ప్ర‌స్తావిస్తూ హార్వ‌ర్డ్‌ క‌న్నా హార్డ్ వ‌ర్క్ శ‌క్తిమంత‌మైంది అంటూ సేన్‌కు చుర‌క‌లంటించారు. నోట్ల రద్దు దేశ వృద్ధి రేటును తగ్గించ‌డం కాదు క‌దా పెంచిందని తాజా జీడీపీ డేటా నిరూపించిన మ‌రుస‌టి రోజే మోడీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఓవైపు నోట్ల ర‌ద్దును విమ‌ర్శించేవాళ్లు హార్వ‌ర్డ్‌లో చ‌దివిన వాళ్లు ఏం చెబితే అదే మాట్లాడుతుంటే.. మ‌రోవైపు ఓ పేద‌వాడి కొడుకు మాత్రం దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను వృద్ధిలోకి తీసుకెళ్ల‌డానికి చెమ‌టోడ్చి ప‌నిచేస్తున్నాడు అని మోడీ అన్నారు. యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న నోట్ల ర‌ద్దును విమ‌ర్శించిన వారికి స‌మాధానం చెప్పారు.

నోట్ల ర‌ద్దు జీడీపీపై ఎలాంటి ప్ర‌భావం చూప‌లేదని, ఊహించిన దానికంటే ఎక్కువ‌గా 7 శాతం వృద్ధి న‌మోదైంద‌ని తాజా గ‌ణాంకాలు నిరూపించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ నోట్ల ర‌ద్దును అమ‌ర్త్య‌సేన్ తీవ్రంగా తప్పుబ‌ట్టారు. ప్ర‌జాస్వామ్య నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఏక‌ప‌క్షంగా ఓ ల‌క్ష్యం లేకుండా ప్ర‌యోగించిన మిస్సైల్ నోట్ల ర‌ద్దు అని సేన్ విమ‌ర్శించారు. దీనిపై ఘాటుగా స్పందించిన మోడీ ఉన్న‌త విద్యావంతుల కంటే సామాన్యులు విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. అలాంటి వారి శ్ర‌మ‌ను వృథా చేసే రీతిలో మ‌ట్లాడ‌టం స‌రికాద‌ని అన్నారు.

కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన ఎస్పీ, బీఎస్పీ త్రిశంకు సభ ఏర్పాటుకు కొత్త నాటకాలు ఆడుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ మండిపడ్డారు. మూడోదశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్పీ, బీఎస్పీలకు వాస్తవ పరిస్థితి బోధ పడి గెలుపొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఏ ఒక్కరికీ మెజారిటీ రావద్దన్న ధోరణితో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పాటైతే రెండు పార్టీలు బేరసారాలాడవచ్చని పథకం వేశాయన్నారు. యూపీలో సొంత బలంపై గెలుపొందే సామర్థ్యం బీజేపీకి ఉన్నదన్నారు. ఒకవేళ తమ పార్టీకి పూర్తి మెజారిటీ లభించినా మిత్రపక్షాలకు క్యాబినెట్‌లో చోటు కల్పిస్తామని మోడీ చెప్పారు. అన్ని రంగాల్లో వెనుకబడిన పూర్వాంచల్ ప్రాంతాన్ని దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్దుతానని మోడీ హామీనిచ్చారు.