Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కోటలో మోడీ సభ..?

By:  Tupaki Desk   |   18 Nov 2018 8:48 AM GMT
కేసీఆర్‌ కోటలో మోడీ సభ..?
X
తెలంగాణలో బీజేపీ అగ్రనేతల ప్రచార షెడ్యూల్ ఖరారయింది. ప్రధాని నరేంద్రమోడీ ఆరు సభల్లో పాల్గొంటుండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 12 సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 25 - 27 - 28 తేదీల్లో అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు సభల చొప్పున మొత్తం 12 సభల్లో ఆయన పాల్గొనేలా బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ డిసెంబర్ 3 - 5 తేదీల్లో ఆరుసభల్లో పాల్గొంటారని సమాచారం. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే అగ్రనేతల సభలను ఏర్పాటుచేశారు. అయితే, ఇందులో టార్గెట్ కేసీఆర్ అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఆయన సభలు ఏర్పాటు చేయాలని భావించిన నేతలు.. సూర్యాపేట - సిద్ధిపేట - నిజామాబాద్‌ జిల్లాల వైపు మొగ్గుచూపారు. అయితే, ఇప్పుడు ప్లాన్‌ మార్చినట్టు తెలిసింది. సిద్దిపేట బదులుగా గజ్వేల్‌లో సభ నిర్వహించాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి ఆకుల విజయను బీజేపీ బరిలోకి దింపుతోంది. ఆమె ఏ మేరకు ప్రభావం చూపిస్తారనే విషయం అటుంచితే.. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఏకంగా ప్రధాని మోడీ ప్రచార సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక.. ఈ నెల 25 - 27 - 28 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణలో పర్యటిస్తారు. రోజుకు మూడు నుంచి నాలుగుసభల చొప్పున మొత్తం 12 సభల్లో ఆయన పాల్గొనేలా బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. అమిత్‌ షా తోపాటు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ - పలువురు కేంద్రమంత్రులు ప్రచారానికి తరలిరానున్నారు.

ఇదిలాఉండ‌గా....తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితాలో గ‌జ్వేల్ సీటుకు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. బ‌బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ కార్యదర్శి - కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఏడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు పోటీగా గజ్వేల్‌ లో బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో ఆమె సిరిసిల్లలో కేటీఆర్‌ పై పోటీ చేసి ఓడి పోయారు. టీఆర్ ఎస్‌ లో టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ దక్కలేదు.