Begin typing your search above and press return to search.

జనం చేతికి చిక్కిన నారాయణ - శ్రీచైతన్య..వీడియో వైరల్

By:  Tupaki Desk   |   16 Jun 2019 12:59 PM GMT
జనం చేతికి చిక్కిన నారాయణ - శ్రీచైతన్య..వీడియో వైరల్
X
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన కార్పొరేట్ విద్యా సంస్థలు నారాయణ - శ్రీచైతన్య సంస్థలు తమదైన మాయాజాలాన్ని కొనసాగిస్తున్నాయి. పదో తరగతి ఫలితాల దగ్గర నుంచి ఎమ్ సెట్ - నీట్ - జేఈఈ... ఇలా ఏ ఫలితాలు వెలువడినా తమదైన ప్రకటనలతో వెర్రెత్తిస్తున్న ఈ సంస్థలు.. తాజాగా విడుదలైన నీట్ ఫలితాల్లోనూ అదే తరహా మాయాజాలాన్ని ప్రదర్శించాయి. మొన్న వెలువడిన నీట్ ఫలితాల్లో తమ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశవ్యాప్తంగా మెరుగైన ర్యాంకులు సాధించారంటూ గొప్పులు చెప్పుకునే క్రమంలో ప్రముఖ దినపత్రికలను తమ వాణిజ్య ప్రకటనలతో ముంచెత్తాయి. తమ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు సాధించిన ర్యాంకులను చెప్పుకుంటే ఫరవా లేదు గానీ... ఆ ప్రకటనల్లో ఆ రెండు విద్యా సంస్థలు చేసిన మాయాజాలాన్ని జనం కనిపెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ రెండు విద్యా సంస్థల మాయాజాలాన్ని జనం విపరీతంగా షేర్ చేస్తున్నారు.

నారాయణ విద్యా సంస్థ టాప్ ర్యాంకులు సాధించిన తమ విద్యార్థుల ఫొటోలతో పాటు వారి పేర్లు - హాల్ టికెట్లను కూడా ప్రచురించేసింది. అయితే ఒక ర్యాంక్ సాధించిన విద్యార్థి... మరో ర్యాంకు కూడా సాధించినట్లు పేర్కింది. టాప్ ర్యాంకులో పెద్ద ఫొటోను వాడిన నారాయణ.. ఇంకో ర్యాంకు వద్ద అదే విద్యార్థికి చెందిన చిన్న ఫొటోను ప్రచురించింది. అంటే... తమ వద్ద చదివిన ఓ విద్యార్థి ఒక ర్యాంకును సాధిస్తే... నారాయణ మాత్రం అదే విద్యార్థి ఇంకో ర్యాంకును సాధించినట్లు ప్రకటించి అడ్డంగా దొరికిపోయింది. ఇక శ్రీ చైతన్య కూడా తక్కవేమీ తినలేదనే చెప్పాలి. నారాయణ ప్రకటనలో ఉన్న విద్యార్థిని తమ విద్యార్థిగా ప్రకటించేసుకుని ఆ విద్యార్థి ఫొటోతో ప్రకటన ఇచ్చేసింది.

నారాయణ మాదిరే... ఒక విద్యార్థికి ఒకే ర్యాంకు వస్తే... శ్రీచైతన్య కూడా రెండు, మూడు చోట్ల సదరు విద్యార్థి ఫొటోను వేరే ర్యాంకులకు జత చేస్తూ ప్రకటన గుప్పించేసింది. మొత్తంగా నారాయణతో పాటు శ్రీచైతన్య కూడా నీట్ ర్యాంకులకు సంబంధించి ఫేక్ ర్యాంకులతో అడ్వర్టైజ్ మెంట్స్ ఇచ్చాయన్న మాట. ఇదిలా ఉంటే... మరింత మాయాజాలాన్ని ప్రదర్శించిన నారాయణ - శ్రీచైతన్యలు ర్యాంకుల్లో ఆలిండియా ర్యాంకు అని - సౌతిండియా ర్యాంకు అని ఎక్కడికక్కడ వీలయినంత మేర మాయాజాలాన్ని ప్రదర్శించాయి. ఈ తరహా మాయాజాలాన్ని జనం ఏం గుర్తిస్తారులే అని ఈ విద్యా సంస్థలు అనుకుంటే... ఇప్పుడు మాత్రం జనం దానిని గుర్తించేసి తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు విద్యా సంస్థలకు చెందిన యాడ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.