Begin typing your search above and press return to search.

పోసాని నిప్పుల‌పై లోకేష్ కూల్ రిప్లై

By:  Tupaki Desk   |   21 Nov 2017 5:18 PM GMT
పోసాని నిప్పుల‌పై లోకేష్ కూల్ రిప్లై
X
నంది అవార్డుల వివాదం మ‌లుపు తిరుగుతోంది. ఏపీలో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించడం...దానిపై సినీ ప్ర‌ముఖుడు పోసాని కృష్ణ‌ముర‌ళి మండిప‌డ‌టం తెలిసిందే. నంది విషయంలో విమర్శించినంత మాత్రాన మేం నాన్ రెసిడెంట్ ఆంధ్రానా..? అని పోసాని ప్రశ్నించారు. తెలంగాణలో బతికి తెలంగాణ గడ్డను రాజకీయం చేసింది ఆంధ్రా నాయకులు కాదా..? పోసాని ప్రశ్నించారు. ఈ నేప‌థ్యంలో లోకేష్ సైతం స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో తనకు ఓటు హక్కు లేకుంటే తాను శాసన మండలికి ఎలా వచ్చానో ఆలోచించాలని లోకేష్ అన్నారు. అలాంటి అవగాహన కూడా లేని వారు తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఏపీలోనే ఓటు హక్కు ఉందని స్పష్టం చేశారు. ఉండవల్లిలోనే త‌న కుమారుడు దేవాన్ష్‌కు ఆధార్‌కార్డు ఉందన్నారు. మ‌రోవైపు నంది అవార్డుల విషయంపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై కళాకారులకు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ నంది అవార్డుల‌పై ఎన్న‌డూ లేనంత‌గా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందేనన్నారు. విమర్శలపై స్పందించిన మంత్రి లోకేష్‌ నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించారు.

నాన్‌ రెసిడెన్షియల్స్‌, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు లేనివారని అవార్డులపై మాట్లాడుతున్నారన్న మంత్రి లోకేష్‌ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జంగా గౌతం డిమాండ్‌ చేశారు. నంది అవార్డులకు కులం ఆపాదించవద్దంటూనే.. కళాకారులకు ప్రాంతాలు ఆపాదించే పనికి లోకేష్‌ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన కమిటీలోని సభ్యులను రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు చూసి నియమించారా? రెసిడెన్షియల్‌ చూసే నటులకు అవార్డులు ఇచ్చారా? ఎక్కువ నంది అవార్డులు వచ్చిన బాలకృష్ణ రెసిడెన్స్‌ ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.