Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ గాలి తీసేలా మాట్లాడిన లోకేశ్‌!

By:  Tupaki Desk   |   21 March 2019 10:03 AM GMT
మ‌ళ్లీ గాలి తీసేలా మాట్లాడిన లోకేశ్‌!
X
నీరు ప‌ల్ల‌ము ఎరుగు. సూర్యుడు తూర్పున ఉద‌యించును. త‌ప్పులు చేయుట కొంద‌రికి అల‌వాటు. త‌ప్పులు మాట్లాడ‌టం లోకేశ్ కు రివాజు అన్నట్లు ఎట‌కారం చేసుకునే ప‌రిస్థితి. సోష‌ల్ మీడియా పోస్టుల‌తో ఎట‌కారం ఆడేసే లోకేశ్ బాబు.. చేతికి మైకు ఇచ్చి మాట్లాడండి సార్ అంటే చాలు.. అయ్య‌గారి వ్య‌వ‌హార‌మంతా ఇట్టే బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఎప్పుడు ఎలా మాట్లాడాల‌న్న చిన్న విష‌యంలోనూ చిన‌బాబుకున్న టాలెంట్ కు 'ప‌ర‌వ‌శించి'పోవాల్సిందే.

ఏపీ మంత్రి లోకేశ్ నోరు విప్పితే చాలు.. త‌ప్పులో కాలేయ‌ట‌మో.. ఎదుటోళ్లు ఎట‌కారం చేసేలా మాట్లాడ‌ట‌మో ఆయ‌న‌కు అల‌వాటుగా మారిన‌ట్లైంది. ఇటీవ‌ల కాలంలో లోకేశ్ మాట్లాడిన మాట‌లు విప‌రీతంగా వైర‌ల్ కావ‌ట‌మే కాదు.. ఆయ‌న మాట‌లిప్పుడు జోకులుగా ప్ర‌చార‌మ‌వుతున్నాయి. ఇక‌.. ఆయ‌న ప్ర‌త్య‌ర్థులైతే లోకేశ్ మాట‌ల్ని చీల్చి చెండాడుతుంటే వాటికి స‌మాధానం చెప్ప‌లేక టీడీపీ నేత‌లు కిందామీదా ప‌డుతున్నారు.

అంబేడ్క‌ర్ వ‌ర్థంతి శుభాకాంక్ష‌లు.. మంచినీటి స‌మ‌స్య క‌ల్ప‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 200 సీట్లు.. మొన్న‌టికి మొన్న వివేక దార‌ణ‌హ‌త్య‌పై మాట్లాడుతూ ప‌ర‌వ‌శం అంటూ నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేస్తున్న మాటల‌తో ఆయ‌న ఇమేజ్ దారుణంగా దెబ్బ తింటున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అంద‌రిని అవాక్కు అయ్యేలా చేయ‌ట‌మే కాదు.. కీల‌క‌మైన ఎన్నిక‌ల డేట్ నుకూడా లోకేశ్ మ‌ర్చిపోయారా? ఆ విష‌యంలోనూ క‌న్ఫ్యూజ‌నా? అంటూ బుగ్గ‌లు నొక్కుకునే ప‌రిస్థితి. లోకేశ్ మాట‌లు టీడీపీ గాలి తీసేలా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు వాపోతున్నాయి.

వారి ఆవేద‌న‌కు త‌గ్గ‌ట్లే తాజా ఉదంతం చోటు చేసుకుంది. గురువారం తాడేప‌ల్లి మండ‌లం వ‌డ్డేశ్వ‌రంలోని రాధా రంగాన‌గ‌ర్ లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాల‌ని కోరారు. ఎన్నిక‌లు ఏప్రిల్ తొమ్మిదిన జ‌రుగుతున్నాయ‌ని.. ఆ రోజు అంద‌రూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాల‌ని ఆయ‌న కోరారు.

లోకేశ్ మాట‌ల్లో త‌ప్పు దొర్లిన విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి వారు ముసిముసిగా న‌వ్వుకున్నారు. ఇక‌.. అక్క‌డే ఉన్న టీడీపీ నేత బండి చిరంజీవి లోకేశ్ చెవికి ద‌గ్గ‌ర‌గా వెళ్లి తొమ్మిది కాదండి ప‌ద‌కొండు అంటూ స‌రిదిద్ద‌టంతో.. తాను త‌ప్పుగా మాట్లాడిన దాన్ని క‌వ‌ర్ చేసేందుకు లోకేశ్ కిందామీదా ప‌డ్డారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల పోలింగ్ తేదీని త‌ప్పుగా చెప్పిన లోకేశ్ వ్యాఖ్య‌పై వైఎస్సార్ కాంగ్రెస్ నేత .. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌దైన శైలిలో ఎట‌కారం ఆడేశారు. నారా లోకేశ్ గారి అభ్య‌ర్థ‌న మేర‌కు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ట్వీట్ చేశారు. ఈ సెటైర్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అయినా.. లోకేశ్ బాబు.. పోలింగ్ తేదీ మ‌ర్చిపోవ‌టం ఏమిటి?