Begin typing your search above and press return to search.

నన్ను మ‌ళ్లీ ప‌వ‌న్ హ‌ర్ట్ చేశాడంటున్న లోకేష్‌

By:  Tupaki Desk   |   20 April 2018 5:36 PM GMT
నన్ను మ‌ళ్లీ ప‌వ‌న్ హ‌ర్ట్ చేశాడంటున్న లోకేష్‌
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు - రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మ‌ళ్లీ హ‌ర్ట‌య్యారు. అది కూడా జనసేన పార్టీ అధ్య‌క్షుడు పవన్‌ కల్యాణ్ కార‌ణంగా. వ‌రుస‌గా రెండోసారి త‌న‌పై ప‌వ‌న్ ఆరోప‌ణ‌లు చేశారంటూ లోకేష్ చిన్న‌బుచ్చుకున్నారు. అందుకే రెండు ట్వీట్లు చేశారు. లోకేష్‌ పై పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా ప‌వ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ అవినీతి తారాస్థాయికి చేరింద‌ని..ఆయ‌న తాత అయిన దివంగ‌త ఎన్టీఆర్ ఈ తీరును చూస్తే క్షోభిస్తార‌ని పార్టీ ప్లీన‌రీ వేదిక‌గా ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అనంతరం దీనిపై టీడీపీ త‌నదైన శైలిలో కౌంట‌ర్లు ఇచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు నాలుగేళ్ల త‌ర్వాత అవినీతి గుర్తుకు వ‌చ్చిందా అని ప్ర‌శ్నించిన టీడీపీ నేత‌లు..త‌మ నాయ‌కుడిని విమ‌ర్శించే హ‌క్కు లేద‌ని మండిప‌డ్డారు. లోకేష్ అవినీతికి ఆధారాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

తాజాగా శ్రీరెడ్డితో తన తల్లిని తిట్టించింది లోకేష్ అంటూ పవన్ కల్యాణ్ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియాతో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పవన్ విమర్శించారు. స‌చివాల‌యం సాక్షిగా ఈ కుట్ర‌లు సాగుతున్నాయ‌ని కూడా ప‌వ‌న్ ఫైర్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో లోకేష్ స్పందించారు. ట్విట్ట‌ర్‌లో రెండు ట్వీట్ల‌తో త‌న ఆవేద‌నను పంచుకున్నాడు. `ప‌వన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ` అంటూ రెండు ట్వీట్ల‌లో తన ఆవేద‌న‌ను లోకేష్ వెల్ల‌డించారు.

కాగా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కంటే ఆయ‌న త‌న‌యుడైన లోకేష్‌నే ప‌వ‌న్ టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొద్దికాలం క్రితం లోకేష్ అవినీతి ఎపిసోడ్‌పై విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌ అనంత‌రం టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తే.. త‌ను చేసిన అవినీతి ఆరోపణలను సమర్థించుకున్న సంగ‌తి తెలిసిందే. `లోకేష్‌ అవినీతి అందరికీ తెలిసిందే...అందరి కళ్లముందు జరుగుతున్నదే.. ఈ విషయం ఎవరికి తెలియదు?` అంటూ త‌న‌ను క‌లిసిన ప‌లువురు వామ‌ప‌క్షాల నేత‌ల‌తో ప‌వ‌న్ వ్యాఖ్యానించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. `అయినా...లంచం పుచ్చుకునేవారు రసీదులేమైనా ఇస్తారా… ఏంటీ?` అని పవన్‌కల్యాణ్ వామ‌ప‌క్షాల నాయ‌కుల‌తో అన్న‌ట్లుగా తెలుస్తోంది. లోకేష్‌ అవినీతి జగమెరిగినదేనని, తానేమీ ఆధారాల్లేకుండా ఆరోపించలేదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ట్లుగా స‌మాచారం. త‌మ‌పై విమ‌ర్శ‌లు చేసే బ‌దులుగా అవినీతి జ‌రుగుతున్న తీరుపై టీడీపీ నాయ‌కులు స్పందించాల‌ని, అలా జ‌ర‌గ‌కుండా చూసి ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌ని ప‌వ‌న్ అన్న‌ట్లుగా స‌మాచారం. దీనికి కొన‌సాగింపుగా తాజాగా మ‌ళ్లీ లోకేష్‌ పై విరుచుకుప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.