Begin typing your search above and press return to search.

ఏందీ.. మ‌హావృక్షం.. వేళ్లు.. పండ్లు.. లోకేశ్‌!

By:  Tupaki Desk   |   13 Feb 2016 12:21 PM GMT
ఏందీ.. మ‌హావృక్షం.. వేళ్లు.. పండ్లు.. లోకేశ్‌!
X
దెబ్బ మీద దెబ్బ అన్న‌ట్లుగా ఓప‌క్క గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం.. ఆ షాక్ నుంచి తేరుకుందామ‌ని అనుకున్నంత‌లోనే టీటీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు త‌న మూడు ద‌శాబ్దాల సైకిల్ స‌వారీని వ‌దిలేసి.. కారులో ఎక్కేయ‌టం మ‌రింత షాకింగ్ గా మారింది. టైం బ్యాడ్ అయిన‌ప్పుడు ప‌రిస్థితి ఎంత గ‌డ్డుగా ఉంటుందో తాజాగా టీ తెలుగుదేశం పార్టీ ప‌రిస్థితి చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే.. పార్టీ నుంచి జంప్ అయిన త‌మ్ముళ్లంతా పార్టీని విలీనం చేసేస్తామంటూ చేస్తున్న‌వ్యాఖ్య‌లు పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల్ని తీవ్ర నిరాశ నిస్పృహ‌ల్లో నింపుతున్నాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌రోసారి రంగ‌ ప్ర‌వేశం చేశారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌. త‌న‌కు బాగా అల‌వాటైన ఫేస్ బుక్ లో త‌న భావాల్ని చెబుతూ.. తెలుగుదేశాన్ని విప‌రీతంగా అభిమానించి.. ఆరాధించే వారిలో కొండంత ధైర్యాన్ని నింప‌ట‌మే కాదు.. మీకేం కాదు నేను ఉన్నానంటూ భ‌రోసాను క‌ల్పించ‌టం గ‌మ‌నార్హం. చుట్టూ న‌లుగురు చేరితే వారిని ఆక‌ట్టుకునేలా మాట్లాడే విష‌యంలో కాస్త వెన‌క‌డుగులో ఉండే లోకేశ్ బాబు.. సోష‌ల్ మీడియాలో మాత్రం అదిరిపోయే వ్యాఖ్య‌లు చేస్తుంటారు.

తాజాగా ఆయ‌న పెట్టిన పోస్టింగ్ చూస్తే.. టీడీపీ కార్య‌క‌ర్త‌ల క‌ష్టంతో నాయ‌కులుగా ఎదిగిన వారిని టీఆర్ ఎస్ త‌న పార్టీలోకి చేర్చుకుంటోంద‌ని.. కార్య‌క‌ర్త‌ల త్యాగ ఫ‌లాల్ని దోచుకుపోతున్న టీఆర్ ఎస్ కు తెలియ‌ని విష‌యం ఏమిటంటే.. వేళ్లు భూమిలో నాటుకుపోయిన ఒక మ‌హా వృక్షం తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చారు. మీరంతా దొంగ‌లిస్తోంది పండ్లు మాత్ర‌మే.. చెట్టు మాత్రం చెక్కుచెద‌ర‌దంటూ చెప్పుకుపోయారు.

విశ్లేష‌ణ బాగానే ఉన్నా.. ఒక్క‌సారి తెగులు ప‌డ్డ చెట్టు.. తిరిగి కోలుకోవ‌టానికి ఎంత కాలం ప‌డుతుంద‌న్న విష‌యం లోకేశ్ కు తెలియంది కాదు. నిరాశ‌లో ఉన్న కార్య‌క‌ర్త‌లకు ప్రోత్స‌హాం క‌లిగేలా పోస్టింగ్ పెట్ట‌టంలో లోకేశ్ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పొచ్చు. అదే స‌మ‌యంలో.. మ‌హా వృక్షం.. వేళ్లు.. పండ్లు.. ఏంది లోకేశ్ అంటూ కామెడీ చేసే వారు కూడా లేక‌పోలేదండోయ్‌.