Begin typing your search above and press return to search.

ఓటమిపై చంద్రబాబుకు లోకేష్ నివేదిక..ఏం చెప్పారంటే!

By:  Tupaki Desk   |   20 Aug 2019 10:33 AM GMT
ఓటమిపై చంద్రబాబుకు లోకేష్ నివేదిక..ఏం చెప్పారంటే!
X
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీ వ్యాప్తంగా చిత్తుగా ఓడటానికి సంబంధించి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అధ్యయనం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓటమికి కారణాలను అన్వేషించి తన తండ్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నివేదిక ఇచ్చారట నారా లోకేష్. ఆ నివేదిక గురించి సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం సాగుతూ ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల తేడా లేకుండా తెలుగుదేశం చిత్తుగా ఓడినప్పటికీ జిల్లాల వారీగా లోకేష్ నివేదిక సాగినట్టుగా తెలుస్తోంది. ఒక్కో జిల్లాల్లో ఒక్కో కారణం చేత టీడీపీ ఓడిందని లోకేష్ తేల్చారట. ఆ కారణాలను జిల్లాల వారీగా చూస్తే..

ప్రకాశం జిల్లాలో సిద్ధారాఘవరావు, దామచర్ల జనార్ధన్ ల వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందని లోకేష్ నివేదికలో పేర్కొన్నారని సమాచారం.

కర్నూలు జిల్లాలో అఖిలప్రియ, కేఈ కృష్ణమూర్తిల రాజకీయమే తెలుగుదేశం పుట్టి ముంచిందని తేల్చారట. అఖిలప్రియ అతితో పార్టీ పై వ్యతిరేకత పెంచిందని లోకేష్ బృందం తేల్చిందట.

అనంతపురంలో పరిటాల కుటుంబం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని, జిల్లాలోని నేతలందరితోనూ వారు రచ్చలు పెట్టుకుని పార్టీకి నష్టం చేశారని తేలిందని సమాచారం.

కడపలో ఆదినారాయణ రెడ్డి వల్ల మొత్తం వ్యవహారం దెబ్బతిన్నదని, ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యవహరించిన తీరు పార్టీకి ఎంతో నష్టం చేకూర్చిందని పేర్కొన్నారని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో నాయకత్వ లోపం ప్రస్ఫుటం అయ్యిందని, చంద్రబాబు నాయుడు జిల్లా రాజకీయం పై దృష్టి సారించకపోవడంతో తేడా కొట్టిందని పేర్కొన్నారట.

ఇక నెల్లూరులో ఐదు సార్లు ఓడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మినిస్టర్ పదవి ఇవ్వడం పార్టీని నిస్పృహకు గురి చేసిందని తేల్చారట.

గుంటూరులో పార్టీకి ఎలాంటి నియంత్రణ లేకపోయిందని - కృష్ణాలో దేవినేని ఉమామహేశ్వరరావు వర్సెస్ మిగతా తెలుగుదేశం నేతల పోరాటం సాగిందని లోకేష్ నివేదికలో పేర్కొన్నారని టాక్.

వెస్ట్ లో రాజులతో తెలుగుదేశం పార్టీ సఖ్యత లేకపోవడం - కమ్మ పెత్తనం ఎక్కువ కావడం - తూర్పు గోదావరిలో పవన్ కల్యాణ్ ప్రభావం వల్ల తెలుగుదేశం చిత్తు అయ్యిందని లోకేష్ తన తండ్రికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టుగా ప్రచారం సాగుతూ ఉంది.