Begin typing your search above and press return to search.

అరేరె..చిన‌బాబు ప‌రువు తీస్తారేం త‌మ్ముళ్లు?

By:  Tupaki Desk   |   6 July 2018 2:30 PM GMT
అరేరె..చిన‌బాబు ప‌రువు తీస్తారేం త‌మ్ముళ్లు?
X
అదేం ద‌రిద్ర‌మో కానీ ఏపీ అధికార‌ప‌క్షంలో ఉన్న‌న్ని లోపాలు మ‌రే పార్టీలో క‌నిపించ‌వు. పైకి మా గొప్ప పార్టీగా క‌నిపించే తెలుగుదేశం పార్టీలో స‌మ‌న్వ‌యం అన్న‌ది అస్స‌లు క‌నిపించ‌దు. పార్టీ ముఖ్య‌నేత‌ల లైన్ ఒక మాదిరి.. కిందిస్థాయి నేత‌ల లైన్ మ‌రోలా ఉండ‌టం క‌నిపిస్తుంది. కీల‌క అంశంపై పార్టీలో నెంబ‌ర్ టూ అయిన లోకేశ్ మాట్లాడిన త‌ర్వాత‌.. త‌న అభిప్రాయాన్నిచెప్పిన త‌ర్వాత అందుకు భిన్న‌మైన వాద‌న‌ను వినిపించ‌టం టీడీపీలోనే క‌నిపిస్తుందేమో?

ప్రాంతీయ పార్టీల్లో మ‌రెక్క‌డా క‌నిపించ‌ని అవ‌ల‌క్ష‌ణాలు టీడీపీలో చాలానే క‌నిపిస్తాయి. ఇప్ప‌టికే చిన‌బాబు మాట‌ల మీద జోకులు జోరుగా వినిపిస్తున్న వేళ‌.. తాజాగా తెలుగు త‌మ్ముడు ఒక‌రు చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. కొత్త సందేహం క‌ల‌గ‌క మాన‌దు.

దేశ వ్యాప్తంగా ముంద‌స్తు ఎన్నిక‌ల మీద జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. ఆ మ‌ధ్య‌న లోకేశ్ ను ఇదే విష‌యం మీద అడిగితే.. ప్ర‌జ‌లు అధికారాన్ని ఇచ్చింది ఐదేళ్ల కోసం.. వారిచ్చిన కాలమంతా పాలించి.. ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన బాధ్య‌త త‌మ‌పైన ఉన్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. మ‌రి.. 2004లో ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఎందుకు త‌ప్పు చేశార‌న్న ప్ర‌శ్న‌ను లోకేశ్‌ కు సంధించి ఉంటే.. ఆయ‌నేం స‌మాధానం చెప్పేవారో?

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ముంద‌స్తుకు తాము సిద్ధంగా లేమ‌న్న‌ట్లుగా లోకేశ్ స్ప‌ష్టం చేయ‌గా.. అందుకు భిన్న‌మైన వాద‌న‌ను వినిపించారు ఎమ్మెల్యే భూమా బ్ర‌హ్మానంద రెడ్డి. తాజాగా విలేక‌రుల‌తో మాట్లాడిన ఆయ‌న‌.. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో తాను.. ఏపీముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేసిన‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే త‌మ పార్టీ అందుకు సిద్ధంగా ఉంద‌ని చెప్పటం విశేషం. ఓప‌క్క లోకేశ్ ముంద‌స్తుకు నో అంటే నో అనేస్తుంటే.. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే బ్ర‌హ్మానంద‌రెడ్డి మాత్రం ముంద‌స్తుకు ఓకే అన‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.