Begin typing your search above and press return to search.

చిన‌బాబు మ‌ళ్లీ బుక్క‌య్యాడుగా!

By:  Tupaki Desk   |   25 March 2019 11:18 AM GMT
చిన‌బాబు మ‌ళ్లీ బుక్క‌య్యాడుగా!
X
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ కీల‌క మంత్రి నారా లోకేశ్ కామెడీ అయిపోతున్నారు. ఎంత‌గా నిబ్బ‌రించుకుందామ‌నుకున్నా... ఆయ‌న నాలిక మ‌డ‌త ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేదు. జ‌యంతికి, వ‌ర్ధంతికి తేడా తెలియ‌ని లోకేశ్ కూడా ఓ మంత్రేనా అంటూ వైరి వ‌ర్గాల నుంచి సెటైర్ల మీద సెటైర్లు వ‌స్తున్నా... లోకేశ్ మాత్రం త‌న నాలిక మ‌డ‌త‌ను స‌రిచేసుకోలేక‌పోతున్నారు. ఫ‌లితంగా త‌న‌ను తాను న‌వ్వుల పాలు చేసుకోవ‌డంతో పాటుగా త‌న‌తో వ‌చ్చే వారిని, పార్టీ నేత‌ల‌ను, చివ‌రకు త‌న తండ్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని కూడా ఆయ‌న న‌వ్వుల పాల్జేస్తున్నారు. అయినా ఈ సారి లోకేశ్ ఏం కామెడీ చేశారంటే... గ‌తంలో చేసిన కామెడీకి ముత్తాత లాంటి కామెడీని లోకేశ్ పండించేశారు.

నిన్న తాను పోటీ చేస్తున్న మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారానికి వెళ్లిన లోకేశ్... త‌న తండ్రి స్థాయిలో టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుపై ఒంటికాలి మీద లేచేందుకు య‌త్నించారు. అయితే ఆ లేవ‌డ‌మేంటో గానీ... దెబ్బ మాత్రం అవ‌త‌లి వారికి కాకుండా త‌న‌కే త‌గిలేస‌రికి ఇప్పుడు ఆయ‌న ఏ ముఖం పెట్టుకుని బ‌య‌ట‌కెళ్లాలో తెలియ‌క నానా తంటాలు ప‌డుతున్నారు. అయినా ఎంత కామెడీ అయిపోయినా... ఎన్నిక‌ల స‌మ‌యం క‌దా... బ‌య‌ట‌కు వెళ్ల‌క త‌ప్ప‌దు. కామెడీ పండించిన త‌న నోటితోనే ఓట్లు అడ‌గ‌కా త‌ప్ప‌దు. స‌రే... లోకేశ్ ఇప్పుడు చేసిన కామెడీ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకే ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించిన లోకేశ్... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎందుకు వేయ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని వివ‌రించేందుకు య‌త్నించారు. జ‌గ‌న్ కు ఓటేస్తే... ఆ ఓటు కేసీఆర్‌ కు వేసిన‌ట్టేన‌ని చెప్పుకొచ్చిన లోకేశ్... త‌న మాట విన‌కుండా జ‌గ‌న్‌ కే ఓటేస్తే ఎలాంటి విప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌న్న విష‌యాన్ని సోదాహ‌ర‌ణంగా వివ‌రించే య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలోనే త‌న‌దైన ఫ్లోను కొన‌సాగించిన లోకేశ్... ఈ ద‌ఫా జ‌గ‌న్ పార్టీకి ఓటేస్తే... ఏపీపై కేసీఆర్ పెత్త‌నం చెలాయిస్తార‌ని, ఏపీలోని విలువైన సంప‌ద‌నంతా దోచుకెళ‌తార‌ని చెప్పారు. ఇలాంటి విలువైన వాటిలో బంద‌రు పోర్టును ప్ర‌స్తావించిన లోకేశ్... జ‌గ‌న్ కు ఓటేస్తే... కేసీఆర్ బంద‌రు పోర్టును హైద‌రాబాద్ కు ఎత్తుకెళ‌తారంటూ త‌న‌దైన శైలి పంచ్ సంధించారు. ఏదో అలా నోరు జారింది... దానిని స‌రిచేసుకుందామ‌నుకున్నా... దొర్లిన పొర‌పాటును లోకేశ్ గుర్తించ‌లేక‌పోతున్నారు. ఈ మాట అన్నాక త‌నూ గుర్తించ‌లేదు, ప‌క్క‌న వాళ్లూ ఏమీ చెప్ప‌లేదు. అలాగే లోకేశ్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు. తీరా ప్ర‌చారం ముగించుకుని ఇంటికి వెళితే గానీ తాను మాట్లాడిన పొర‌పాటేమిటో ఆయ‌న‌కు తెలియ‌లేదట‌. లోకేశ్ ఇంటికెళ్లేలోగానే... ఆయ‌న బంద‌రు పోర్టు ఎత్తుకెళ్లే మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయాయి. బంద‌రు పోర్టును ఎలా ఎత్తుకెళ‌తారండీ? స‌ముద్రంతో క‌లిపి ఎత్తుకెళ‌తారా? స‌ముద్రం లేకుండా పోర్టును మాత్ర‌మే ఎత్తుకెళ‌తారా? అంటూ నెటిజ‌న్లు సంధించిన సెటైర్ల‌తో లోకేశ్ కు మ‌తి త‌ప్పినంత ప‌నైంద‌ట‌.