Begin typing your search above and press return to search.

లోకేశ్ గారూ!... ఇదెక్క‌డి లెక్క సారూ!

By:  Tupaki Desk   |   20 April 2019 12:22 PM GMT
లోకేశ్ గారూ!... ఇదెక్క‌డి లెక్క సారూ!
X
కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఏపీలో అధికార పార్టీ టీడీపీ అంతెత్తున ఎగిరి ప‌డుతోంది. పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడితో పాటు ఆ పార్టీకి చెందిన ప్ర‌తి నేత కూడా ఈసీ తీరుపై విరుచుకుప‌డుతూనే ఉన్నారు. ఏపీలో ఇటీవ‌ల ముగిసిన ఎన్నిక‌ల పోలింగ్ లో అర్ధ‌రాత్రి దాకా పోలింగ్ ను కొన‌సాగించిన ఈసీ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్ర‌బాబు అయితే ఏకంగా ఈసీ తీరుకు నిర‌స‌న‌గా ధ‌ర్నాకు కూడా దిగారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్నా కూడా ఏమాత్రం ప‌ట్టించుకోని చంద్ర‌బాబు... ఏకంగా ఈసీ కార్యాల‌యం ఎదుటే ధ‌ర్నాకు దిగ‌డంతో పాటు ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల‌కృష్ణ ద్వివేదీని నిల‌దీసినంత ప‌నిచేశారు. తాజాగా ఇప్పుడు లోకేశ్ వంతు వ‌చ్చిన‌ట్టుంది. కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన లోకేశ్... ఈసీ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ రెండు వ‌రుస ట్వీట్లు సంధించారు.

ఈసీ దేశం మొత్తాన్ని ఓ కంటితో చూస్తూ... ఏపీలోని త‌మ పార్టీని మాత్రం మ‌రో కంటితో చూస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా ఉన్న త‌న తండ్రి స‌మీక్ష‌లు చేస్తే స‌హించ‌లేని ఈసీ.... అదే తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మీక్ష‌లు చేస్తున్నా, ఆ స‌మీక్ష‌ల్లో అక్క‌డి సీఎస్‌, డీజీపీ పాలుపంచుకుంటున్నా కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విరుచుప‌డ్డారు. అయినా ఎన్నిక‌ల కోడ్ ఏపీలో ఒక‌లా, తెలంగాణ‌లో ఒక‌లా ఎందుకు ఉంటుంద‌ని కూడా ఆయ‌న పోలిక‌లు తీశారు. ఈ సంద‌ర్భంగా త‌న ట్వీట్ల‌లో లోకేశ్ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా? ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా? తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం?* అంటూ ఫైరైపోయారు.

అయితే లోకేశ్ ప్ర‌స్తావించిన ఈ పోలిక లెక్క ఏమాత్రం స‌రికాద‌న్న వాద‌న ఇప్పుడు వినిపిస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన మాట వాస్త‌వ‌మేగానీ... ఏపీలో సార్వ‌త్రికంతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యాన్ని లోకేశ్ మ‌రిచార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా ఉన్నారు. అదే తెలంగాణలో కేవ‌లం పార్ల‌మెంటు ఎన్నిక‌లు మాత్ర‌మే జ‌రిగాయి. అంతేకాకుండా ఓ నాలుగు నెల‌ల ముందే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు ముగియ‌గా.... కేసీఆర్ బంప‌ర్ మెజారిటీతో గెలిచారు. మ‌రి ఆప‌ద్ధ‌ర్మ సీఎంకు, సీఎంకు మ‌ధ్య తేడా తెలియ‌కుండా లోకేశ్ ఈ వ్యాఖ్య‌లు ఎలా చేశార‌న్న‌ది ఇప్ప‌డు ఏ ఒక్క‌రికీ అర్థం కావ‌డం లేదు.