Begin typing your search above and press return to search.

లోకేష్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించవద్దు!

By:  Tupaki Desk   |   17 Jan 2019 6:37 AM GMT
లోకేష్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించవద్దు!
X
తెలుగు రాష్ర్టాల‌ రాజకీయాల్లో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్‌ ఎస్‌ నేతలు.. ఆంధ్రప్రదేశ్‌ లో ప్రధాన పక్షమైన వైసీపీ నాయకులతో సంప్రదింపులు - సమాలోచనలు జరిపారు. టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ - వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన రెడ్డితో హైదరాబాద్‌ లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జగన్‌ నివాసమైన లోటస్‌ పాండ్‌ వేదికైంది. భేటీ అనంతరం ఇరువురు నేతలూ మీడియాతో మాట్లాడారు. అయితే, ఈ భేటీపై ఏపీ మంత్రి నారా లోకేష్‌ మండిపడ్డారు. అంతా ఊహించిన‌ట్లుగానే - లోకేష్ మీడియాతో మాట్లాడకుండా...ట్విట్ట‌ర్‌ లో త‌న స్పంద‌న వినిపించారు. దీంతోపాటుగా...ఎప్ప‌ట్లాగే ఈ భేటీని బీజేపీకి అంట‌గ‌ట్టారు!

వైఎస్సార్‌ సీపీ చీఫ్‌ జగన్ - టీఆర్‌‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ స‌మావేశాన్ని పేర్కొంటూ ముగ్గురు మోడీలు ఒక్కటయ్యారని ట్విటర్‌‌ లో విమర్శించారు. ‘ఢిల్లీ మోడీ - ఆంధ్రా మోడీ - తెలంగాణ మోడీ ఒక్కటయ్యారు. ఇంతకాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతమైంది. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన వాటా దక్కకుండా అడ్డుపడుతున్న కేసీఆర్‌‌ తో కలిసి జగన్‌ ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్‌ ఏర్పాటు చేశారు’ అని ఆయన ఆరోపించారు. ‘లంకలో పుట్టినవాళ్లంతా రాక్షసులు.. ఆంధ్రాలో పుట్టినవాళ్లంతా వారి వారసులని కేసీఆర్‌‌ ఆంధ్రులను అవమానించారు. అలాంటి కేసీఆర్‌‌ తో జగన్‌ మోడీ రెడ్డి జతకట్టారు’ అని విమర్శించారు.

ఇక త‌మ యువ‌నేత ఒర‌వ‌డిలోనే ఆ పార్టీ నాయ‌కులు - మంత్రులు సైతం న‌డిచారు. పోలవరంపై కేసులు వేసిన వారితో ఏవిధంగా పొత్తు పెట్టుకోవాలని చూస్తారని జగన్‌ ను ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. కేసీఆర్‌‌ ఏర్పాటు చేసేది ఫెడరల్ ఫ్రంట్ కాదని - మోడీ చేతిలో కీలుబొమ్మల ఫ్రంట్ అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. మోడీ డైరెక్షన్‌ లోనే కేటీఆర్‌‌ - జగన్‌ భేటీ జరిగిందని ఆయన ఆరోపించారు.

కాగా, ఈ ఆరోప‌ణ‌ల‌కు వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేతలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది నీచమైన మనస్తత్వమని దుయ్యబట్టారు. ఫెడరల్‌‌ ఫ్రంట్‌ కోసం దేశవ్యాప్తంగా అందరు నేతలతో చర్చిస్తున్నట్లుగానే జగన్‌ తోనూ చర్చించారని - దీనిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. టీఆర్ ఎస్‌ తో పొత్తు ఉండదని - ఏపీలో 175 సీట్లకు ధైర్యంగా పోటీ చేసే దమ్ము.. ధైర్యం వైఎస్సార్‌ సీపీకి ఉందని చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని - తమ నేత జగన్‌ మాత్రం ఈ విషయంలో నిబద్ధతతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.