Begin typing your search above and press return to search.

నంది ర‌చ్చ‌పై బ్రాహ్మ‌ణి అలా.. బాల‌య్య ఇలా

By:  Tupaki Desk   |   18 Nov 2017 1:10 PM GMT
నంది ర‌చ్చ‌పై బ్రాహ్మ‌ణి అలా.. బాల‌య్య ఇలా
X
ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌పై వివాదం బాగా ముదిరిన సంగ‌తి తెలిసిందే. క‌మ్మ లాబీయింగ్ తో అవార్డులు ఒక సామాజిక వ‌ర్గానికి ఎక్కువ‌గా వ‌చ్చాయ‌ని ఒక‌రంటే.. ముఖ్య‌మైన సినిమాల‌కు రాకుండా లెజెండ్ మూవీకి తొమ్మిది అవార్డులు ఇస్తారా? అంటూ మ‌రికొంద‌రు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ వివాదంపై టీవీల్లో జ‌రిగిన చ‌ర్చ‌ల సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు కొంద‌రు ఒక అడుగు ముందుకేసి నంది క‌మిటీల‌పై బాల‌య్య ప్ర‌భావం ఉందంటూ ఆరోప‌ణ‌లు కూడా చేసేశారు.

ఇలా నంది అవార్డుల‌పై గ‌తంలో ఎప్పుడు జ‌ర‌గ‌నంత ర‌చ్చ జ‌రుగుతోంది. సినీ వ‌ర్గాల మ‌ధ్య‌నే ఇంత ఉంటే.. ఇక సోష‌ల్ మీడియాలో సాగుతున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఈ వ్య‌వ‌హారంపై చాలానే విమ‌ర్శ‌లు.. వ్యాఖ్య‌లు పోస్ట్ అవుతున్నాయి. ఇలాంటి వేళ‌.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో జ‌రిగిన ర‌క్త‌దాన కార్య‌క్ర‌మంలో బాల‌కృష్ణ‌.. బ్రాహ్మ‌ణి.. సినీ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బాల‌కృష్ణ ర‌క్త‌దానం చేశారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు. త‌న తండ్రికి నంది అవార్డు రావ‌టం ప‌ట్ల బ్రాహ్మ‌ణి ఆనందం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై నెల‌కొన్న వివాదం గురించి ప్ర‌శ్నిస్తే.. వివాదాల గురించి మాట్లాడే స‌మ‌యం ఇది కాదంటూ సున్నితంగా విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేశారు బ్రాహ్మ‌ణి. కుమార్తె స్పంద‌న‌కు కాస్త భిన్నంగా బాల‌య్య స్పందించారు.

"లెజెండ్ సినిమాకు ఉత్త‌మ న‌టుడి అవార్డు రావ‌టం సంతోషంగా ఉంద‌న్న బాల‌య్య‌.. లెజెండ్ టైటిల్ మామూలు టైటిల్ కాద‌న్నారు. ఈ టైటిల్‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడే చాలా కాంట్రావ‌ర్సీలు వ‌చ్చాయ‌ని.. అవ‌న్నీ తెలిసిందేన‌న్నారు. లెజెండ్ టైటిల్ అన్న‌ది మామూలు టైటిల్‌కాదు. అది పెట్టిన‌ప్పుడే ఎలాంటి కాంట్రవ‌ర్సీలు వ‌చ్చాయో మీకు తెలుసు. అది మాట‌ల‌తో కాదు చేత‌ల‌తో చూపించింది. మా లెజెండ్ సినిమా. యూనిట్ అంద‌రి కృషి వ‌ల్లే ఇన్ని అవార్డులు సొంతం చేసుకున్నాం. నా ఒక్క‌డి కార‌ణంగా మాత్రంకాదు. నంది అవార్డులు గెలుచుకున్న ప్ర‌తి ఒక్క‌రికి నా అభినంద‌న‌లు' అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని చిత్రాల‌కు నంది అవార్డులు రావ‌టం లేద‌న్న వివాదంపై ప్ర‌శ్నించ‌గా.. దానికి బ‌దులు ఇవ్వ‌కుండా వెళ్లిపోయారు బాల‌య్య‌.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జ‌గ‌ప‌తి బాబు స్పందిస్తూ.. ఉత్త‌మ విల‌న్ గా నంది అవార్డు రావ‌టం ఆనందంగా ఉంద‌న్నారు. అదే స‌మ‌యంలో నంది అవార్డుల వివాదంపై మాత్రం ఆయ‌న పెద‌వి విప్ప‌లేదు. ఎవ‌రికి వారు వివాదంపై స్పందించ‌కుండా తాము చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పేయ‌టం గ‌మ‌నార్హం.