Begin typing your search above and press return to search.

నంద‌మూరి సుహాసిని అఫిడ‌విట్ లో ఏం చెప్పారంటే

By:  Tupaki Desk   |   18 Nov 2018 6:52 AM GMT
నంద‌మూరి సుహాసిని అఫిడ‌విట్ లో ఏం చెప్పారంటే
X
కూకట్‌ పల్లి టీడీపీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. శ‌నివారం ఉదయం బాబాయ్ బాలకృష్ణతో క‌లిసి సుహాసిని తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ నివాళులు అర్పించిన అనంత‌రం బాలకృష్ణ మాట్లాడుతూ సుహాసినిని గెలిపిస్తే ఎన్టీఆర్ - హరికృష్ణకు నివాళి అర్పించినట్టే అని అన్నారు. సుహాసినికి కూకట్‌ పల్లి టికెట్ ఇచ్చి చంద్రబాబు మహిళలను గౌరవించారని పేర్కొన్నారు. నందమూరి ఇంటి నుంచి ఓ మహిళ ముందుకొచ్చి పోటీ చేస్తున్నారని.. ఎన్టీఆర్ - హరికృష్ణ స్ఫూర్తితో ముందుక సాగుతామని బాలయ్య చెప్పారు.

కాగా, సుహాసిని త‌న అఫిడ‌విట్లో వివిధ వివ‌రాల‌ను పేర్కొన్నారు. త‌న‌కు రూ. 5.82 కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని ఆమె వివ‌రించారు. రూ. 10 ల‌క్ష‌ల ఇన్‌ కం ట్యాక్స్ క‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. 43 ఏళ్ల వ‌య‌స్సున్న సుహాసిని త‌ను డిగ్రీ పూర్తి చేశాన‌ని తెలిపారు. త‌న‌కు వ‌స్తున్న ఆదాయం అంతా అద్దెల రూపంలోనేన‌ని తెలిపారు. సామాజిక కార్య‌కర్త‌గా త‌న‌ను తాను పేర్కొన్న ఆమె త‌న కుమారుడు చుండ్రు వెంక‌ట సాయి రూ.12 ల‌క్ష‌ల ఐటీ చెల్లించార‌ని వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి సోదరులైన సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్‌ రామ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మరికొంత మంది కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. దీంతో చివరి నిమిషం వరకూ ఆమె పోటీ చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే, సుహాసిని నామినేషన్ దాఖ‌లు చేశారు. మరోవైపు ఆ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించిన కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ - మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఏ మేరకు సహకారం అందిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీరిద్దరితో ఇప్పటికే సుహాసిని ఫోన్‌ లో మాట్లాడి సహకారం తీసుకున్నట్లు తెలిసింది.