Begin typing your search above and press return to search.

నాగం దారిపై బీజేపీలో అయోమ‌యం?

By:  Tupaki Desk   |   14 Jan 2018 1:00 PM GMT
నాగం దారిపై బీజేపీలో అయోమ‌యం?
X
తెలంగాణ‌లో అధికారాన్ని కైవసం చేసుకోవాల‌ని చూస్తున్న భారతీయ జనతా పార్టీ ఆ ద‌శ‌కు చేరుకునేముందు ఎన్నో ప‌రీక్ష‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధనరెడ్డి తీరు పార్టీ అగ్రనేతలను ఆందోళనలో పడేస్తోంది. కొద్ది కాలంగా పార్టీ తీరుతెన్నులపై గుర్రుగా ఉన్న నాగం జనార్ధనరెడ్డి ఇటీవ‌ల బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వాన్ని రాష్ట్ర నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ భవితవ్యంపై ఆయన అంచనాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వ అవినీతిపై తాను మాట్లాడుతుంటే వద్దని చెబుతున్నారనేది నాగం ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. అందుకే త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఉంద‌ని అంటున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు నుండి నాగం ఇంత వరకూ ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ నేపథ్యంలో టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ నగారాను స్థాపించారు. 2012లో ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగి గెలుపొందిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున మహబూబ్‌నగర్ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీలో స్వేచ్ఛగా వ్యవహరించిన నాగం జనార్ధనరెడ్డి బీజేపీలో సంప్రదాయ చట్రంలో పనిచేయడానికి ఇబ్బంది పడినా జాతీయ నాయకత్వాన్ని చూసి పార్టీకోసం పనిచేసేందుకు మంచి అవకాశాలు రాకపోతాయా అని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో ఇటీవలి కాలంలో తన నిరసనను తెలుపుతునే ఉన్నారు.

అయితే, పార్టీ వీడి వెళ్లాలనేది తన తక్షణ కార్యాచరణ కాకపోయినా, అసంతృప్తిని వ్యక్తం చేయడం ద్వారా నాయకత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంలో నాగం విజయం సాధించారు. అయితే ఇటీవల మరొక అడుగు ముందుకు వేసి త్వరలో తన కార్యాచరణ వెల్లడిస్తానని అనడం గుబులు పుట్టిస్తోంది. కార్యాచరణ అంటే బీజేపీలో ఉంటూ అధికార పార్టీపై పోరు సాగించడానికి ఉద్ధేశించిందా లేక నేరుగా పార్టీ వ్యవహార సరళిపైనే తిరుగబాటు బావుటా ఎగురవేస్తారా అనే మీమాంసలో పార్టీ నేతలున్నారు. గతంలో నీటిపారుదల ప్రాజెక్టులలో అంతులేని అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో సహా నాగం టీఆర్‌ఎస్‌పై ఎలుగెత్తారు. అది పార్టీలో కొంత మంది నేతలకు నచ్చలేదనే ప్రచారం కూడా జరిగింది. 36 ఏళ్ల రాజకీయ అనుభవం తనకు ఉన్నా కనీసం తనను పట్టించుకోవడం లేదని, ఆత్మగౌరవం లేని చోట ఉండొద్దని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారని ఇటీవల కొంత మంది వద్ద నాగం బయటపడినట్టు తెలిసింది. కార్యకర్తల అభీష్టం మేరకు ఉగాది తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెబుతున్నారు.

కాగా, బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్థన్‌రెడ్డి వ్యవహారాన్ని పార్టీలో చర్చిస్తామని ఆపార్టీ శాసనసభాపక్షనేత జి కిషన్‌రెడ్డి చెప్పారు. అయితే దీనిపై తాను వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు. నాగం వ్యాఖ్యలు పార్టీ దృష్టికి వచ్చాయని చెప్పారు. అయితే ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు కొందరు నాగం జనార్థన్‌రెడ్డితో జరిపిన చర్చలు విఫలమైనట్టు సమాచారం. ఉగాది తర్వాత తాను పార్టీని వీడుతానని, 2019 ఎన్నికలు తన జీవితానికి ఆఖరివని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగం వ్యవహారంపై పార్టీలో విస్త్రుతంగా చర్చ జరుగుతోంది.