Begin typing your search above and press return to search.

గుగూల్ సీఎం.. క‌లాం అంత్య‌క్రియ‌ల‌కు వెళ్ల‌లేదే?

By:  Tupaki Desk   |   3 Aug 2015 10:03 AM GMT
గుగూల్ సీఎం.. క‌లాం అంత్య‌క్రియ‌ల‌కు వెళ్ల‌లేదే?
X
వ్యంగ్యంగా వ్యాఖ్య‌లు చేయ‌టంలో బీజేపీ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డి స్టైలే వేరు. అంత పెద్ద వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డినే త‌న విమ‌ర్శ‌ల‌తో తీవ్ర‌స్థాయిలో ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేసిన ఆయ‌న‌.. గ‌త కొద్దికాలంగా మాట్లాడ‌టం బాగా త‌గ్గించేశార‌ని చెప్పాలి.

2004లో వైఎస్ ముఖ్య‌మంత్రిగా మారి.. తిరుగులేని నాయ‌కుడిగా వెలిగిపోతున్న స‌మ‌యంలో.. వైఎస్‌ను విమ‌ర్శించేందుకు నాటి టీడీపీ నేత‌లు సైతం వెనుకాడేవారు. అప్ప‌ట్లో తెలుగుదేశంలో ఉన్న నాగం జానార్ద‌న‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా త‌న వ్యంగ్య వ్యాఖ్య‌ల‌తో వైఎస్ పై విరుచుకుప‌డ‌ట‌మే కాదు.. ఆయ‌నకు చిరాకు తెప్పించే వారు.

తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా ఉస్మానియా క్యాంప‌స్‌కు వెళ్లిన నాగంకు అక్క‌డి విద్యార్థుల చేతిలో తీవ్ర ప‌రాభ‌వం జ‌ర‌గ‌టం.. ఆయ‌పై దాడి చోటు చేసుకున్న నాటి నుంచి ఆయ‌న వైఖరిలో చాలానే మార్పు వ‌చ్చింది. టీడీపీకి రాజీనామా చేసిన ఆయ‌న‌.. త‌ర్వాత కాలంలో బీజేపీలో చేరారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలుకావ‌టంతో మ‌రింత నిరాశ‌కు గురైన ఆయ‌న‌.. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే మాట్లాడుతున్నారు. తాజాగా ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్య‌లు చూసిన‌ప్పుడు ఆయ‌న వ్యంగ్యంలో చురుకు త‌గ్గ‌లేద‌ని తెలుస్తుంది.కేసీఆర్ ను గూగుల్ సీఎంగా అభివ‌ర్ణించిన నాగం.. ఆయ‌న స‌ర్కారు మాటల ప్ర‌భుత్వంగా కొట్టిపారేశారు.

నిజాం గిరి చేస్తానంటే న‌డ‌వ‌దంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మండిప‌డిన నాగం.. మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకాని తెలంగాణ ముఖ్య‌మంత్రి.. డీఆర్ డీవోకు మాత్రం క‌లాం పేరు పెట్టాల‌ని డిమాండ్ చేయ‌టం హాస్యాస్ప‌దమ‌న్నారు. తెలంగాణ‌లో మంత్రులు ఉత్త ఉత్స‌వ విగ్ర‌హాలుగా మారిపోయార‌ని.. వారేం చేయ‌టం లేద‌న్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఒక‌ప్పుడు ఏ వైఎస్ ను అడ్డంగా తిట్టేశారు.. ఇప్పుడదే వైఎస్ అమ‌లు చేసిన ప‌థ‌కాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌టం గ‌మ‌నార్హం.