Begin typing your search above and press return to search.

వైసీపీలోకి నాగ‌బాబు నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   10 Feb 2016 1:04 PM GMT
వైసీపీలోకి నాగ‌బాబు నిజ‌మేనా?
X
ఇన్నాళ్లు ఆంద్ర‌ప్ర‌దేశ్‌ లో నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న కాపు ఉద్య‌మం ఒక్క‌సారిగా ఎగిసి త‌న స‌త్త చాటిన నేప‌థ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ అప్ర‌మ‌త్తమ‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన కాపు ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు నాగబాబును వైసీపీ గూటికి ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

నాగబాబుతో మంతనాలు జరపాలని సీనియర్ నేత బొత్సకు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ బాధ్యతలు అప్పగించారని స‌మాచారం. ఈ క్ర‌మంలో నాగబాబుతో చర్చల్లో భాగంగా పార్టీలో కీలక బాధ్యతలతో పాటు కాకినాడ పార్లమెంట్ టికెట్‌‌ను జగన్ ఆఫర్ చేసినట్టు పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఈ ఆఫర్‌‌ పై స్పందించిన నాగబాబు తనకు కాస్త టైం కావాలని అడిగినట్టు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. నాగబాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్ కనుక వస్తే వైసీపీకి సామాజికంగా..సినీ గ్లామర్ పరంగా పెద్ద బెనిఫిట్ దక్కినట్టే. ఎందుకంటే కాపు నేతల్లో నాగబాబు పట్ల సానుకూల దృక్పథం ఉంది. దాంతో పాటు ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మెగా ఫ్యామిలీ అండడండలు వైసీపీ వెంట ఉంటాయి. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు లెక్కన అటు కాపు బలం..ఇటు సినీమా గ్లామర్ వైసీపీకి దక్కుతాయని జగన్ ఆలోచన.

కాపులకు రాజ్యాధికారమే లక్ష్యంగా 30 ఏళ్ల సినీ ప్రస్థానానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన స‌మ‌యంలో ఆయన సోదరులు నాగబాబు - పవన్ కళ్యాణ్‌ అన్నయ్యకు తోడుగా నిలబడ్డారు. అయితే పీఆర్‌ పీ ఎన్నికల్లో ఓటమిపాలవ్వడం..తర్వాత కాంగ్రెస్‌ లో విలీనం చేయడంతో మెగా బ్రదర్స్‌ మధ్య విభేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో చిరు కాంగ్రెస్‌ లోనే కొనసాగుతుండగా..పవన్‌ బీజేపీ - చంద్రబాబుతో జతకట్టారు. అయితే నాగబాబు మాత్రం ‌రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంతో పాటు ప్ర‌స్తుతం కాపు అజెండా ముందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది.