Begin typing your search above and press return to search.

నంబర్ 1 ఎన్టీఆరా.. నాదెండ్ల భాస్కరరావా?

By:  Tupaki Desk   |   20 Feb 2017 10:53 AM GMT
నంబర్ 1 ఎన్టీఆరా.. నాదెండ్ల భాస్కరరావా?
X
తెలుగుదేశం పార్టీకి చెందిన వారైనా, ఎన్టీఆర్ కుటుంబసభ్యులైనా.. ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా.. ఇష్టమున్నా లేకున్నా ఎన్టీఆర్ గురించి నాలుగు ముక్కలు మంచిగా మాట్లాడకుండా ముగించరు. ఎన్టీఆర్ ను తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిపిన నేతగా.. మహా నాయకుడిగా కీర్తిస్తారు. కానీ.. ఒకప్పుడు చంద్రబాబు కంటే ముందుగానే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి కొద్దికాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు మాత్రం ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ లేదని తేల్చేశారు. అసలు తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ ది కాదని, తనదని.. అప్పట్లో టీడీపీలో తానే నెంబర్ 1 అని, ఎన్టీఆర్ కాదని సెన్సేషనల్ కామెంట్లు చేశారు.

ఓ ఛానల్ తో మాట్లాడిన నాదెండ్ల గతాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో మీడియా అంతా తనను దుర్మార్గుడిగా, ఎన్టీఆర్ సన్మార్గుడుగా చిత్రీకరించడంతో వాస్తవాలు ప్రజలకు తెలియలేదన్నారు. ఎన్టీఆర్ చేసిన పాపాలన్నీ చెబితే ‘తూ’ అని ఉమ్మేస్తారన్నారు. ఎన్టీఆర్ ను అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో నేను ఎప్పుడూ తప్పుడు సలహాలు ఇవ్వలేదని.. అప్పట్లో చంద్రబాబే అలాంటి సలహాలు చెప్పేవారన్నారు. చంద్రబాబు సలహాలు వినే ఎన్టీఆర్ విచిత్రమైన పనులు చేసేవారని.. రూ.2 కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ కు ఏమీ తెలియదని అన్నారు. అంతేకాదు.. చంద్రబాబు గురించి కూడా నాదెండ్ల చాలా విషయాలు చెప్పుకొచ్చారు. స్వయంగా ఎన్టీఆరే తన అల్లుడు చంద్రబాబును తార్పుడు గాడు అని, రెండు వందల కోట్లు తినేశాడని చెప్పారని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ ను నేను వెన్నుపోటు పొడిచాననడం చాలా తప్పు. ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ కు నేను వెన్నుపోటు పొడిచాననేది.. పత్రికలు చేసిన పని. పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని ఓడించాం. గంగా, యమున ఏకమయ్యాయి, కనుక, కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. నా మూలంగానే టీడీపీ పుట్టింది. సినిమాల్లో హీరోగా ఆయన కనపడ్డా, నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన. టిక్కెట్ల ఎంపికలో మా ఇద్దరిలో ఎవరిదీ పైచేయి కాదు. ఇద్దరం చాప వేసుకుని కూర్చున్నాము. ఎన్టీఆర్ అయితే, అసలు పోటీ చేయనని కూర్చున్నాడు. ఎందుకంటే, భయం.. ఓడిపోతానని భయం. ఎన్టీఆర్ వియ్యంకులు ఆయన్ని డిస్కరేజ్ చేశారు. మానవ నైజం చెబుతున్నాను.. ఎంత ధైర్యస్తులో అంత పిరికివాళ్లు కూడా’ అని నాదెండ్ల ఎన్టీఆర్ గురించి ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారట.

అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ ను ఇప్పుడు తీయాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహముందంటున్నారాయన. తెలుగుదేశం పార్టీ పడిపోతోందని, ఆ పార్టీని మళ్లీ బతికించాలంటే ఎన్టీఆర్ పై బయోపిక్ తీయడమే మార్గమని భావించారని, అందుకే, ఈ చిత్రం తీస్తామని ప్రకటించారని నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయపడ్డారు. ‘‘ఇది మొదలు పెట్టింది చంద్రబాబు. వియ్యంకుడు బాలకృష్ణ ను పిలిచి సినిమా తీయాలని చెప్పాడు. వియ్యంకుడికి సినిమా బాధ్యతలు అప్పజెబితే... చంద్రబాబు తన కొడుకుని మంత్రి చేసుకోవచ్చు. మంత్రి పదవి కొడుక్కి ఇవ్వాలా? వియ్యంకుడికా? బాలకృష్ణ ఏమో ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకేమో ఎమ్మెల్యే కాదు. కనుక, మంత్రి పదవి తన కొడుక్కి ఇవ్వాలంటే.. బాలకృష్ణను పక్కకు తోసెయ్యాలి. మరి, పక్కకు తోసెయ్యాలంటే.. బాలకృష్ణను సినిమా తీయమని, కావాలంటే డబ్బులు తీసుకోమని చెప్పారు’ అంటూ కొత్త వెర్షన్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ లో ఉన్న ఏకైక మంచితనం ఆయన సొంత కుటుంబ సభ్యులను కూడా ‘రండి’ అంటూ గౌరవించడమే.. ఎన్టీఆర్ తన భార్యను కూడా ‘రండి’ కూర్చోండి అంటాడు’ అని అన్నారు. అది తప్ప ఆయనలో ఇంకేమీ మంచి లేదన్నారు. రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు కనుక, సినిమా వాళ్లు సీఎంలు అయ్యారన్నారు. ఎన్టీఆర్’పై తీయనున్న బయోపిక్ లో తన పాత్ర ఉండదని అనుకుంటున్నానని... తనను విలన్ గా చూపితే కోర్టుకు వెళతానని, అప్పుడు ఆ సినిమా రిలీజ్ ఎలా అవుతుందో చూస్తానని అన్నారు. తనకు, బాలకృష్ణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని... బాలకృష్ణ తీయబోయే చిత్రంలో తన తండ్రి సినిమా జీవితాన్ని మాత్రమే తీసుకుంటే ఫర్వాలేదు గానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి తీస్తే బాలకృష్ణ చాలా చిక్కుల్లో పడతాడని అన్నారు. సినిమా తీసే ముందు బాలకృష్ణ తనను సంప్రదిస్తే, వాస్తవాలు చెబుతానని నాదెండ్ల అన్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/