Begin typing your search above and press return to search.

బాబుకు 0 మార్కులు వేసిన మాజీ సీఎం

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:33 AM GMT
బాబుకు 0 మార్కులు వేసిన మాజీ సీఎం
X
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కాలేరని అన్నారు. జగన్‌ను సీఎంగా చూడాలన్న కోరిక ప్రజల్లో కనిపిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీయే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనకు తాను జీరో మార్కులు వేస్తానన్నారు.

రాజకీయాల్లో చంద్రబాబు కంటే పెద్ద అవినీతిపరుడు ఇంకెవరూ లేరని అన్నారు. కుల రాజకీయాలు చేయడంతో చంద్రబాబు మొదటి నుంచి ఆరితేరిపోయారని.. గతంలో కాంగ్రెస్‌లో చంద్రబాబుకు టికెట్‌ ఇచ్చే సమయంలో ఆయన యూనివర్శిటీలో కమ్మ కులం పేరుతో నడిపిన కుల రాజకీయాలు అడ్డుగా వచ్చాయని గుర్తుచేశారు. తాను కాంగ్రెస్‌ లో మంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి చంద్రబాబు తన దగ్గరకు వచ్చి అన్న నా నియోజకవర్గానికి రావాలంటూ బతిమలాడుకున్నారని నాదెండ్ల చెప్పారు. సరే అని వెళ్తే చంద్రబాబు తన ఊరికి కాకుండా చుట్టుపక్కన ఊర్లన్నింటిని తిప్పారన్నారు. అలా ఎందుకు చేస్తున్నారో తొలుత తనకు అర్థం కాలేదన్నారు. కానీ అక్కడున్న వారు చంద్రబాబు కుటుంబం గుడిసెలో నివాసం ఉంటోందని ఆ గుడిసెను చూపించడం ఇష్టం లేకనే సొంతూరుకు తీసుకెళ్లడం లేదని వివరించినట్టు నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలతోనే ఉందన్నారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు జైలుశిక్ష పడాలని.. ఆయన ప్లేసులో ఇంకెవరు ఉన్నా కూడా కచ్చితంగా జైలుకు వెళ్లేవారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చని కానీ ఆయన చేసిన పనులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నాదెండ్ల చెప్పారు. రాష్ట్రాన్ని మీరు విభజిస్తారా లేక నన్ను విభజించమంటారా అంటూ అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. చంద్రబాబు పాలనకు ప్రస్తుతం తాను జీరో మార్కులు వేస్తానన్నారు. హైదరాబాద్‌ లో హైటెక్ సిటీ పేరు చెప్పి భూములను చాలా కాజేశారని.. అలా చేసి చంద్రబాబు డబ్బులు బాగా వెనుకేశారన్నారు. ఇప్పుడు అదే తరహాలో అమరావతి పేరుతో ఆంధ్రామీద పడ్డారని నాదెండ్ల భాస్కరరావు విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/