Begin typing your search above and press return to search.

మీడియా నా ఇంటికి రావ‌ద్దంటున్న మాజీ సీఎం

By:  Tupaki Desk   |   17 Jun 2018 10:33 AM GMT
మీడియా నా ఇంటికి రావ‌ద్దంటున్న మాజీ సీఎం
X
సమాజ్‌వాదీ పార్టీ నేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన కామెంట్లు చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల్లో కీల‌క‌మైన పార్టీగా ఉన్న స‌మాజ్ వాదీ ర‌త‌సార‌థి అయిన అఖిలేష్‌..మీడియా విష‌యంలో అనూహ్య‌మైన ట్విస్ట్ ఇచ్చారు. త‌న ఇంటికి మీడియాను పిలిచేది లేద‌ని అఖిలేష్ ప్ర‌క‌టించారు. అది కూడా త‌న కొత్తింటి గృహ‌ప్ర‌వేశం సంద‌ర్భంగా ఈ మాజీ సీఎం ప్ర‌క‌టించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

వివ‌రాల్లోకి వెళితే...మాజీ సీఎంలను 15 రోజుల్లోగా తమ అధికార నివాసాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ పని చేయడం ఇష్టంలేని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు లొసుగులను వెతికే ప్రయత్నం చేశారు. తమ తమ హయాంలో హంగూ ఆర్భాటాలతో నిర్మించుకున్న భవంతులను ఎలాగైనా తమ ఆధీనంలో ఉంచుకునేలా పావులు కదిపారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.

లక్నోలో ఇన్నాళ్లుగా ఉంటున్న ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేసేందుకు విముఖత చూపిన యూపీ నేతల్లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స‌హా ఆయ‌న తండ్రి అయిన మాజీ సీఎం - మాజీ కేంద్ర మంత్రి ములాయంసింగ్ యాద‌వ్ కూడా ఉన్నారు. బంగ్లా ఖాళీ చేసే విష‌యంలో రెండేళ్ల గడువు కోరుతూ సుప్రీంకు వెళ్లిన విషయం తెలిసిందే. సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురవడంతో చివరికి ఖాళీ చేయక తప్పలేదు. ఈనెల 9వ తేదీన‌ అర్ధరాత్రి సమయంలో విక్రమాదిత్య మార్గ్‌ లో ఉన్న బంగ్లాకు సంబంధించిన తాళాలను అధికారులకు అప్పగించారు.

అయితే, అఖిలేష్ యాదవ్ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిలేష్ యాద‌వ్ తాళాలు అందించిన త‌ర్వాత రోజు ఉదయం బంగ్లాను సందర్శించిన అధికారులు అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు. టీవీ ఛానెల్స్ - మీడియా సిబ్బంది సందర్శన కోసం ఈ రోజు ఉదయం బంగ్లా గేట్లను ఓపెన్ చేసి అనుమతించారు. ప్రభుత్వాధికారులు వెళ్లి చూసే సరికి ఆ బంగ్లాలో ఉన్న ఖరీదైన వస్తువులు - సామాగ్రిని అఖిలేష్ యాదవ్ కుటుంబం తీసుకెళ్లడాన్ని అధికారులు తప్పుపట్టారు. ప్రజాధనాన్ని లూటీ చేశారని మండిపడుతున్నారు. పరిసరాలను చూసి అవాక్కైన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. స్విమ్మింగ్‌ పూల్ కోసం టర్కిష్ నుంచి దిగుమతి చేసుకున్న టైల్స్ - ఫ్లోర్స్ కోసం కొనుగోలు చేసిన ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్‌ ను తవ్వి పట్టుకెళ్లారు. ఏసీలు - దిగుమతి చేసుకున్న సీలింగ్ - గార్డెన్ లైట్లు - అద్దాలు - బాత్‌ రూమ్ ఫిట్టింగ్స్ - తదితర సామాగ్రి బంగ్లా నుంచి మాయమయ్యాయని తెలిపారు. మరీ ముఖ్యంగా జిమ్‌ లో ఉన్న పరికరాలు మొత్తం ఖాళీ చేశారని వివరించారు. అంతటితో ఆగకుండా విదేశాల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన అరుదైన మొక్కలను కూడా వారితో పాటే తీసుకెళ్లారని చెప్పారు.

మాజీ సీఎం తాలుకు ఈ నిర్వాకం అంంతా మీడియా పెద్ద ఎత్తున్నే ప్ర‌సారం చేసింది, ప్ర‌చురించింది. దీంతో అఖిలేష్‌ కు మండిపోయింది. దీనిపై తాజాగా ఈద్ సంబ‌రాల‌కు హాజ‌రైన అనంత‌రం అఖిలేష్ మాట్లాడుతూ ప్రస్తుతం సుల్తాన్ పూర్ రోడ్‌ లోని ఏపీఐ అన్సల్ సిటీలోని ఓ ప్రైవేట్ విల్లాలో నివ‌సిస్తున్న త‌ను..కొత్త నివాసంలోకి మీడియాను అనుమ‌తించ‌బోన‌ని ప్ర‌క‌టించారు. వాస్త‌వంగా జ‌రిగేది ఒక‌టైతే...మీడియాలో ప్ర‌చారం చేసేది ఇంకొక‌ట‌ని మండిప‌డ్డారు. అందుకే త‌న కొత్త నివాసానికి మీడియాను దూరం పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా, ఈ సంద‌ర్భంగా బీజేపీ స‌ర్కారుపై అఖిలేష్ విరుచుకుప‌డ్డారు. ప‌నులు త‌క్కువ చేసి ప్ర‌చారం ఎక్కువ‌ చేసుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.