Begin typing your search above and press return to search.

చిచ్చుపెట్టిన బీజేపీ మళ్లీ.. ఊరు ఖాళీ చేస్తున్నారు..

By:  Tupaki Desk   |   22 May 2019 10:09 AM GMT
చిచ్చుపెట్టిన బీజేపీ మళ్లీ.. ఊరు ఖాళీ చేస్తున్నారు..
X
ఎవరు ఔనన్నా..ఎవరు కాదన్నా.. దేశంలో బీజేపీ గద్దెనెక్కాగా లౌకికత్వం దెబ్బతిన్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ.. అందుకు వారు చాలా ఉదాహరణలు కూడా చెప్తున్నారు. మైనార్టీలైన ముస్లింలు, ఇతర వర్గాలపై దాడులు, దళితులపై దౌర్జన్యాలు, గోవధ నిషేధమంటూ ముస్లింల హత్యలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైతే ఇది మరీ శృతి మించిపోయిందన్నది కఠిన వాస్తవమంటున్నారు.

అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నయాబన్స్ గ్రామం. 2014కు ముందు పచ్చగా ఉండేది. కాంగ్రెస్ హయాంలో ఈ గ్రామంలో హిందూ-ముస్లింలు కలిసి మెలిసి పండుగలు జరుపుకునేవారు. పెళ్లిళ్లు మొదలు చావుల దాకా మతాలకతీతంగా ఈ గ్రామస్థులు కలిసి నడిచారు. కానీ యూపీలో బీజేపీ అధికారంలోకి రావడం.. పైగా హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక ఆ ఊరి తలరాతే మారింది. గత ఏడాది డిసెంబర్ లో బులంద్ షహర్లో గోవధ జరిగింది. దీనికి ముస్లింలే కారణమంటూ చెలరేగిన హింసలో ఓ పోలీస్ అధికారి, ఓ ఆందోళనకారుడు మృతిచెందాడు. ఈ గోవధ చేశారంటూ యోగి ప్రభుత్వం నయాబన్స్ గ్రామానికి చెందిన ఏడుగురు ముస్లింలపై కేసులు పెట్టి జైలుకు పంపింది. అనంతరం అల్లర్లు చెలరేగి హిందూ ముస్లింలు గాయపడి ఈ రెండు వర్గాలు గ్రామంలో చీలిపోయాయి. పచ్చటి పల్లెను మత చాంధసవాదం నిప్పుల కుంపటిగా మార్చింది. గడిచిన ఆరు నెలలుగా గ్రామంలో ఇదే ఉద్రిక్తత కొనసాగుతోంది.

నయాబన్స్ లో మొత్తం 4వేల జనాభా ఉంది. ఇందులో 400 మంది ముస్లింలున్నారు. బీజేపీ ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తుందన్న అంచనాతో వారంతా ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవడానికి రెడీ అయ్యారట.. ఇప్పటికే 12 కుటుంబాలకు పైగా ముస్లిం కుటుంబాలు ఊరును ఖాళీచేసేశారు. ఇంకొంత మంది కూడా ఖాళీ చేయడానికి రెడీ అయ్యారు. ఇలా హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టి ఆ పల్లెను రెండు గా విభజించేశారు.. మరోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో మైనార్టీలైన ముస్లింలు ఊరును ఖాళీ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.