Begin typing your search above and press return to search.

బాబు ఆప్తుడైన ఎంపీకి రంజాన్ రోజే షాక్

By:  Tupaki Desk   |   17 Jun 2018 10:14 AM GMT
బాబు ఆప్తుడైన ఎంపీకి రంజాన్ రోజే షాక్
X
రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుకు ఎంత స‌న్నిహితుడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారికి ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త సుప‌రిచిత‌మే. అలాంటి ముర‌ళీమోహ‌న్‌ కు తాజాగా రంజాన్ రోజున ముస్లిం సోద‌రుల నుంచి అనూహ్య‌మైన షాక్ త‌గిలింది. రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నెహ్రూ నగర్‌ లోని ఈద్గా మైదానానికి రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహన్ వెళ్లారు. వేదికపై మైక్‌ తీసుకొని ప్రసంగిస్తుండగా ముస్లింలు అడ్డుపడ్డారు. `మా కోసం మీరు నాలుగేళ్లలో ఏం చేశారు? మమ్మల్ని - మా సమస్యలను పట్టించుకోలేదు. మీరు మాట్లాడొద్దు... గో బ్యాక్‌`` అంటూ ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇక్కడ్నుంచి వెళ్లిపోండి' అంటూ నినదించారు. కంగుతిన్న మురళీమోహన్‌ మౌనంగా ఉండిపోయారు. బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డ మురళీమోహన్‌ కు అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం పెద్దలు నచ్చజెప్పబోయారు. ముస్లిం సోదరుల నుంచి వ్యతిరేక నినాదాలు ఎక్కువవ్వడంతో మురళీమోహన్‌ వెళ్లక తప్పలేదు.

కాగా, ఎంపీ మురళీమోహన్‌ పై గోదావరి ముస్లింల అసోసియేషన్‌ అధ్యక్షులు అబ్ధుల్‌ రజాక్ ఘాటుగా రియాక్ట‌య్యారు. సంఘటనా స్థలంలోనే ర‌జాక్‌ మాట్లాడుతూ ఆయ‌న ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తమకు చేసిందేమీ లేదని బహిరంగంగానే విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు మురళీ మోహన్‌ దృష్టికి తీసుకెెళ్లినప్పటికీ పరిష్కరించలేదన్నారు. ఇదిలాఉండ‌గా...రంజాన్‌ పర్వదినం రోజున ఈద్గా మైదానంలో మురళీమోహన్‌ కు అవమానం జరగడాన్ని ఆయన అనుచరులు - టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘ‌ట‌నపై టీడీపీ నేత‌లు ప‌రువు కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు. నమాజ్‌ సమయం కావడంతో అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలు మసీదు మత గురువు అయిన ఇమామ్‌ నిర్ణయించిన సమయానికే ఖచ్చితంగా నమాజ్‌ చేస్తారని తెలిపారు. ఉదయం 9.45 గంటలకు నమాజ్‌ చేయాలని నిర్ణయించారని, ఆ సమయంలో మురళీమోహన్‌ ప్రసంగించేందుకు ప్రయత్నించడంతో అడ్డు పడ్డారని వారు వివరణ ఇస్తున్నారు.