Begin typing your search above and press return to search.

కోటి సుపారిలో హంత‌కుడికి ఇచ్చింది 21వేలే?

By:  Tupaki Desk   |   20 Sep 2018 6:18 AM GMT
కోటి సుపారిలో హంత‌కుడికి ఇచ్చింది 21వేలే?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన మిర్యాల‌గూడ ప‌రువుహ‌త్య కేసుకు సంబంధించి రెండు కీల‌కాంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి. త‌న కుమార్తెను త‌న‌కు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్న ప్ర‌ణ‌య్ ను హ‌త్య చేసేందుకు కోటి రూపాయిల డీల్ ను కుదుర్చుకున్న వైనం తెలిసిందే.

త‌న కుమార్తెను పెళ్లి చేసుకోవ‌టం ద్వారా త‌న ప‌రువును ప్ర‌ణ‌య్ తీశాడ‌న్న ఆగ్ర‌హంతో ఉన్న అమృత తండ్రి మారుతి రావు కిరాయి వ్య‌క్తుల‌కు త‌న కుమార్తె భ‌ర్త‌ను చంపేందుకు కోటి ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తొలివిడ‌త‌లో రూ.15 ల‌క్ష‌లు అడ్వాన్స్ ఇచ్చిన‌ట్లుగా తేలింది.

ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. కోటి సుపారీ ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్నా.. హంత‌కుడి చేతికి వ‌చ్చింది మాత్రం రూ.21వేలు మాత్ర‌మేన‌న్న విష‌యం పోలీసుల ద‌ర్యాప్తులో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌ణ‌య్‌ను చంపిన బిహార్ కు చెందిన సుభాష్ శ‌ర్మ‌కు కేవ‌లం రూ.21వేలు మాత్ర‌మే ఇచ్చిన‌ట్లుగా గుర్తించారు.

ఒప్పందంలో భాగంగా తొలి విడ‌త‌లో అడ్వాన్స్ గా మారుతిరావు రూ.15 ల‌క్ష‌లు నిందితుల‌కు చెల్లించాడు. ఈ మొత్తంలో హ‌త్య కేసులో ఏ3గా ఉన్న అస్ఘ‌ర్ అలీ రూ.8ల‌క్ష‌లు.. ఎ4గాఉన్న బారీ రూ.6ల‌క్ష‌లు.. ఏ 5గా ఉన్న క‌రీం రూ.ల‌క్ష చొప్పున పంచుకున్నారు. హ‌త్య చేసిన హంత‌కుడు (సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా) శ‌ర్మ‌కు మాత్రం రూ.21వేలు ఇచ్చారు. త‌మ‌కు రావాల్సిన డీల్ మొత్తం అందిన త‌ర్వాత రూ.10ల‌క్ష‌లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. ప్ర‌ణ‌య్ ను అంతం చేసేందుకు మూడు నెల‌లుగా ప్ర‌య‌త్నించినా శ‌ర్మ ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ కాలేదు. నాలుగు సార్లు టార్గెట్ మిస్ అయ్యింది.ఐదోసారి కానీ మిస్ అయితే.. తాను ఆ ప‌క్క రోజున ఊరికి వెళ్లిపోతాన‌ని.. మ‌ళ్లీ మూడు నెల‌ల త‌ర్వాత తిరిగి వ‌స్తాన‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. నాలుగుసార్లు టార్గెట్ మిస్ కావ‌టంపై విసుగు చెందిన శ‌ర్మ చివ‌రి ప్ర‌య‌త్నంగా 14న చివ‌రి దాడి చేస్తాన‌ని.. ఒక‌వేళ అది కానీ మిస్ అయితే త‌న స్వ‌రాష్ట్రానికి వెళ్లిపోనున్న‌ట్లు చెప్పిన‌ట్లు చెబుతున్నారు. ఒవేళ ఐదోసారి కానీ టార్గెట్ మిస్ అయితే.. ప‌రిణామాలు మ‌రోలా ఉండ‌ట‌మే కాదు.. ప్ర‌ణ‌య్ బ‌తికేవాడ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.