Begin typing your search above and press return to search.

కలెక్టర్ కు మాజీ మంత్రి తుపాకీ గురిపెట్టారు!

By:  Tupaki Desk   |   27 Aug 2016 5:43 AM GMT
కలెక్టర్ కు మాజీ మంత్రి తుపాకీ గురిపెట్టారు!
X
ఈమధ్యకాలంలో ప్రభుత్వ అధికారులపై దాడులు - బెదిరింపులూ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మొన్న ఏపీలో జరిగినా, నిన్న మహారాష్ట్రలో జరిగినా... ఆ విషయంలో రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలూ ఉండకపోవడంతో వీటి పరంపర అలా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్టులో చేరాడు తమిళనాడులోని ఒక మాజీ మంత్రి. ఏపీలో ఒకరు తహసిల్ధార్ పై దాడిచేస్తే.. మహారాష్ట్రలో మరొకరు డిప్యూటీ కలెక్టర్ చెంప చెళ్లుమనిపిస్తే.. ఈయనగారు ఏకంగా కలెక్టర్ కు తుపాకీ తీసి చూపించారు.

తమిళనాడులోణి ధర్మపురి కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్య పరిష్కారాలకోసం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ వివేకానందన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి సుమారు 500మంది రైతులు హాజరై తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ఈ సమావేశంలో రైతులతో పాటు మాజీ మంత్రి ముల్లైవేందన్ కూడా పాల్గొన్నారు. అనంతరం కాసేపు రైతు సమస్యలపై ప్రసంగించారు. ఈ క్రమంలో కంబైనల్లూర్ లోని సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్నాడీఎంకే ప్రముఖుడొకరు ఆక్రమించారని, ఇదే సమయంలో కంబైనల్లూరు ప్రాంతంలో ఉచిత విద్యుత్ కొసం ఆ ప్రాంత రైతులు దరఖాస్తు చేసుకోగా ఇంతవరకూ కనెక్షన్స్ రాలేదెందుకని ప్రశ్నించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ... ఉన్నట్లుండి తన సంచిలోని తుపాకీ తీసి కలెక్టర్ కు గురిపెట్టారు. ఈ సంఘటనకు షాక్ తిన్న కలెక్టర్.. ఈ మాజీ మంత్రి చర్యతో దిగ్భ్రాంతి చెందారు.

అయితే ఈ విషయంపై స్పందించిన సదరు మాజీ మంత్రి వర్యులు మాత్రం అబ్బే అలాంటిది ఏమీ లేదు. తాను రివాల్వర్‌ ను రెన్యువల్ చేయాలని కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నానని.. అయితే ఇంతవరకు రెన్యువల్ చేయలేదని విషయాన్ని చెప్పడానికే కలెక్టర్ కు తుపాకీ చూపించానని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్... తుపాకిని వెంటనే సంచిలో పెట్టకపొతే చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పడంతో.. ఈ మాజీ మంత్రిగారు తుపాకీ లోపల పెట్టారు. అధికారులు - రైతులు హాజరైన సమావేశంలో మంత్రి తుపాకీని తీసి కలెక్టర్ వైపు చూపించడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

కాగా ఈ నెలలోనే మహారాష్ట్రలోని రాయ్‌ గ‌ఢ్‌ లో క‌ర్జాత్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ స్థానిక డిప్యూటీ క‌లెక్ట‌ర్ అభ‌య్ క‌ల్గుద్క‌ర్ చెంప ఛెళ్లుమ‌నిపించారు. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్ అయ్యింది. అనంతరం ఆ ఎమ్మెల్యేపై చర్యలకు అధికారులు గట్టిగా డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వ అధికారిని బెదిరించడం - హింసకు దిగడం - విధులకు ఆటంకం కలిగించడం, చేయిచేసుకోవడంవంటి ఆరోపణలు ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.