Begin typing your search above and press return to search.

కొడుకుపై పెద్ద స్కెచ్చే వేస్తున్న ములాయం

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:40 PM GMT
కొడుకుపై పెద్ద స్కెచ్చే వేస్తున్న ములాయం
X
కుటుంబ కలహాలతో నానా తంటాలు పడుతున్న సమాజ్‌వాదీ పార్టీ మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మహాకూటమిని ఏర్పాటుచేసి పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ తో ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి దిగిన ఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్‌ సింగ్ యాదవ్ ఢిల్లీలో ఆర్‌జెడి - జెడి - కాంగ్రెస్ తదితర పార్టీల నేతలతో మంతనాలు జరిపారు. అఖిలేష్ - శివపాల్ మధ్య తలెత్తిన విభేదాల మూలంగా ఎస్పీ చీలిపోతుందనే వార్తల నేపథ్యంలో మహాకూటమి ఏర్పాటుకు భావసారూప్యత గల పార్టీల నేతల నుండి స్పందన రాలేదు. 2015లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు జెడియు - ఆర్‌ జెడి - కాంగ్రెస్ - ఎస్పీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసినప్పటికీ, చివరిక్షణంలో మహాకూటమి నుండి ఎస్పీ తప్పుకుంది. అయినప్పటికీ మహాకూటమి అధికారం దక్కించుకుంది. యుపిలో బిజెపి అధికారంలోకి రాకుండా చూడాలంటే బిహార్ మాదిరిగా మహాకూటమి ఏర్పాటు తప్పదని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వాదిస్తున్నారు. అయితే బిహార్‌ లో మహాకూటమికి మొండిచెయ్యి చూపించిన ములాయంతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ - ఆర్‌ జెడి - జెడియులు సుముఖత చూపించటం లేదు. కాగా ఈ ప‌రిణామాల‌పై రాజ‌కీయ వ‌ర్గాలు స్పందిస్తూ అధికారం త‌మ‌కే ఖాయ‌మ‌ని ఏ ఒక్క‌రూ భావించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు.

అయితే ఉత్తరప్రదేశ్‌ లో ‘మహా కూటమి’ ఏర్పాటయ్యే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. 27 ఏళ్లుగా కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుకుంటున్నారని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. ‘రాహుల్ గాంధీ యాత్ర అధికార దాహంతోకాక.. రాజకీయాలకు కొత్త రూపం తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టింది’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు. రకరకాల విచ్ఛిన్న రాజకీయాల ద్వారా అభివృద్ధి అంశంనుంచి జనం దృష్టిని మళ్లించడానికి సమాజ్‌ వాది పార్టీ, బిఎస్పీ - బిజెపి సమాన బాధ్యులని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో సమావేశమై - రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లౌకిక శక్తులతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలించాలని కోరిన నేపథ్యంలో సుర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జెడి (యు) నాయకుడు శరద్ యాదవ్ రెండు రోజుల క్రితం రాహుల్‌ తో - ఈ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌ తో సమావేశం కావడం ఈ మహాకూటమికి సంకేతాలన్న ఊహాగానాలను కూడా సుర్జేవాలా తోసిపుచ్చారు. భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్‌ లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోను పొత్తుపెట్టుకోదా? అని విలేఖరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించగా - ఆరునెలల కాలంలో ఏం జరుగుతుందో తాను ఎలా చెప్పగలనని ఆయన ఎదురు ప్రశ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/