Begin typing your search above and press return to search.

తండ్రీ.. కొడుకులు కలిసి జనాల్ని ఆడుకున్నారట

By:  Tupaki Desk   |   21 Feb 2017 4:50 PM GMT
తండ్రీ.. కొడుకులు కలిసి జనాల్ని ఆడుకున్నారట
X
అధికారపక్షానికి చెందిన తండ్రీ కొడుకులు కాట్ల కుక్కల్లా కొట్టుకోవటం సాధ్యమేనా? నువ్వెంత అంటే? నువ్వెంత? అన్నట్లుగా పోట్లాడుకున్న వాళ్లు.. కారణం లేకుండానే తగులాడుకోవటం.. అంతే కారణంగా లేకుండా కలిసిపోవటం లాంటి సీన్లు.. ఉత్తరప్రదేశ్ అధికారపక్షం సమాజ్ వాదీ పార్టీ అంతర్గత సంక్షోభం చూసిందే. తండ్రీ కొడుకుల మధ్య నడిచిన రచ్చ మొత్తం ఒక భారీ స్క్రిప్ట్ గా అనుమానించినోళ్లు కొంతమంది ఉన్నారు.

ఎంత రాజకీయమైనా.. మరీ ఇంత డ్రామా ఆడే అవకాశం ఉందా? అంటూ కొందరు సీరియస్ అయితే.. రాజకీయం అంటే అదే మరి అంటూ చిద్విలాసంగా వ్యాఖ్యలు చేసినోళ్లూ ఉన్నారు. ఎన్నికల వేళ సమాజ్ వాదీ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం.. అంతలోనే సమసిపోవటంపై ఇప్పటికి ఉన్న అనుమానాలు చాలవన్నట్లుగా.. తాజాగా ములాయంకు అత్యంత సన్నిహితుడు.. ఆప్తుడుగా పేరొందిన అమర్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

సమాజ్ వాదీ సంక్షోభం అంతా.. ములాయం సింగ్ ఆడిన డ్రామాగా ఆయన వెల్లడించారు. కొడుకు అఖిలేశ్ ను సీఎం చేయటానికే ఆయనీ డ్రామా ఆడినట్లుగా చెప్పుకొచ్చారు. ములాయం పెద్ద స్క్రిప్ట్ రైటర్ అంటూ చతుర్లు వేసిన ఆయన.. యూపీ ఎన్నికల ముందు ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయగలిగారన్న అమర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీల మధ్య పొత్తుకు కారణంగ ములాయం అని చెప్పారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ములాయం తన గుండె లాంటోడంటూ చెప్పుకునే అమర్ సింగ్.. సరిగ్గా ఎన్నికల వేళ.. ములాయం అండ్ కోకు నష్టం వాటిల్లేలా అమర్ సింగ్ ఎందుకు మాట్లాడుతున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అమర్ సింగ్ మాటల్ని వింటే.. తండ్రీ కొడుకులిద్దరూ కలిసి తమ నాటకంతో జనాల్ని పిచ్చోళ్లను చేశారని చెప్పాలి. మరి..అన్నీ తెలిసిన అమర్ ఇప్పుడే ఎందుకు నోరు విప్పినట్లు చెప్మా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/