Begin typing your search above and press return to search.

ముఖేష్ ఆస్తి ఈ దేశ జిడిపితో సమానం!

By:  Tupaki Desk   |   21 Oct 2016 1:12 PM GMT
ముఖేష్ ఆస్తి ఈ దేశ జిడిపితో సమానం!
X
భారతదేశంలోని అత్యంత సంపన్నుల లిస్ట్ మరోసారి విడుదల చేసింది ఫోర్బ్స్. ఈసారి కేవలం సంపన్నుల లిస్టే కాకుండా వారికున్న డబ్బుతో సృష్టించగలిగే అద్భుతాలను కూడా ప్రస్థావించింది. ఈ విషయంలో ముందుగా సంపన్నుల జాబితా సంగతికి వస్తే... ఎప్పటిలాగానే దేశంలో అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ మరో సారి ఈ ఘనత సాధించారు. వరుసగా తొమ్మిదో ఏడాది దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్ తొలి స్థానంలో నిలిచారు. ఇక ఆ స్థానంలో ఉన్న ముఖేష్ కి ఉన్న ఆస్తి ఒక దేశ జీడీపీతో సమానం కావడం గమనార్హం. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవం. 22.7 బిలియన్ డాలర్ల (రూ.లక్షన్నర కోట్లు)తో యూరప్ లోని ఈస్టోనియా దేశ జిడిపితో సమానమైన సంపదను ముఖేష్ కలిగి ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది.

ముఖేష్ అంబానీ అనంతరం రెండోస్థానంలో సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ నిలిచారు. ఈయన ఆస్తి 16.9బిలియన్‌ డాలర్లు. మూడో స్థానంలో హిందుజా కుటుంబం 15.2బిలియన్‌ డాలర్లతో నిలిచింది. ఇదే క్రమంలో నాలుగో సంపన్న వ్యక్తి అజీం ప్రేమ్‌జీ కాగా, ఆయన ఆస్తి 15బిలియన్‌ డాలర్లు. దీనికి కూడా ఒక రికార్డు ఉంది. అజీం ప్రేమ్‌జీ ఆస్తి మొజాంబిక్‌ దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానం. ఇక ఐదోస్థానంలో 13.90 బిలియన్‌ డాలర్ల ఆస్తితో పల్లోంజీ మిస్త్రీ నిలిచారు.

ఇక వీరికున్న డబ్బుతో సృష్టించ గలిగే ఒకటి రెండు విషయాలను కూడా ఫోర్బ్స్ ప్రస్థవించింది. మన దేశంలోని తొలి ఐదుగురు సంపన్నులకున్న ఆస్తి మొత్తం 83.7 బిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.5.59 లక్షల కోట్లు. ఈ డబ్బుతో 1,230సార్లు మంగళ్‌ యాన్‌ చేసి రావచ్చని, అలాగే ఈ సొమ్ముతో 18సార్లు రియో ఒలింపిక్స్‌ నిర్వహించవచ్చునని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది.

తాజాగా టాప్ వందమంది భారతీయులతో కూడిన జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు కనీస సంపద 1.25 బిలియన్ డాలర్లు కటాఫ్ గా నిర్ణయించింది. కాగా, ఇది గత ఏడాది 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది.