Begin typing your search above and press return to search.

త‌గువుల పెట్టే మీ కుట్ర మాకు తెలుసు బాబు!

By:  Tupaki Desk   |   26 Jun 2017 8:29 AM GMT
త‌గువుల పెట్టే మీ కుట్ర మాకు తెలుసు బాబు!
X
కాపు ఉద్య‌మ నేత.. మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌రోసారి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌న్న ఏపీ సీఎం హామీని ఆయ‌న గుర్తు చేస్తూ.. తాజాగా ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ప్ర‌జ‌ల‌తో.. బీసీ నేత‌ల‌తో చ‌ర్చించి ఏకాభిప్రాయం త‌ర్వాత రిజ‌ర్వేష‌న్ల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని బాబు చెప్ప‌టాన్ని ప్ర‌స్తావించిన ముద్ర‌గ‌డ‌.. బాబు తీరును త‌ప్పు ప‌ట్టారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో వంద శాతం ఏకాభిప్రాయం త‌ర్వాత రిజ‌ర్వేష‌న్ల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పే క‌న్నా.. దేశ‌మంతా ప‌ర్య‌టించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబితే ఇంకా బాగుండేదంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల‌క ప‌లుకుల్ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో మాట్లాడిన‌ప్పుడు.. పార్టీ మేనిఫెస్టోలో రిజ‌ర్వేష‌న్ల అంశం పెట్టిన‌ప్పుడు ఎందుకు చెప్ప‌లేదంటూ మండిప‌డ్డారు.

బీసీ కోటాలో త‌మ‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని త‌మ జాతి కోరుకోవ‌టం లేద‌ని.. ప్ర‌త్యేక కేట‌గిరి కిందే రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. "మా మ‌ధ్య త‌గువులు పెట్టి ప‌బ్బం గ‌డుపుకోవటం మీకు అల‌వాటైంది. మూడేళ్లుగా రిజ‌ర్వేష‌న్ల‌ను డీప్ ఫ్రిజ్ లో పెట్టి 2019లో మ‌ళ్లీ మా వాళ్ల‌తో ఓట్లు వేయించుకోవాల‌నే మీ కుట్ర‌ను తెలుసుకోలేనంత అమాయ‌క స్థితి లో మా జాతి లేదు" అని ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం ఏకాభిప్రాయ సాధ‌న‌కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానించిన బాబు మాట‌లపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్య‌టించి ఏకాభిప్రాయానికి రావాలని.. అప్పుడు చంద్ర‌బాబు ఖ్యాతి ఖండాంత‌రం విరాజిల్లుతుందంటూ త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/