Begin typing your search above and press return to search.

వైసీపీని దెబ్బతీసిన ముద్రగడ

By:  Tupaki Desk   |   10 Feb 2016 6:48 AM GMT
వైసీపీని దెబ్బతీసిన ముద్రగడ
X
కాపు రిజర్వేషన్ల విషయంలో ముద్రగడకు మద్దతుగా ఓపెన్ గా గళమెత్తిన వైసీపీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. ముద్రగడ చేపట్టిన కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో టీడీపీ సర్కారును ఇరుకునపెట్టడంతో పాటు కాపులను తమవైపు తిప్పుకోవాలని భావించిన వైసీపీకి ఆశించన ఫలితం దక్కలేదు. టీడీపీ ఇప్పటికిప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేదని.. కొన్నాళ్లు ఉద్యమాలు నడిస్తే ప్రభుత్వానికి, కాపులకు మధ్య దూరం పెరిగి ఆ వర్గం తమకు దగ్గరవుతుదన్నది వైసీపీ పొలిటికల్ ప్లాన్ అని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే... ముద్రగడ సడెన్ గా తన ఉద్యమం ఆపేయడంతో కాపులు వైసీపీకి దగ్గరయ్యే అవకాశం పోయింది... దాంతో పాటు కాపులకు ఓపెన్ గా మద్దతు ఇవ్వడంతో వారిని వ్యతిరేకిస్తున్న బీసీలు ఇప్పుడు వైసీపీపై గరంగరంగా ఉంటున్నారు. ఏ పార్టీ అయినా రాజకీయ ప్రతిఫలం ఆశించకుండా ఏ పనీ చేయదన్నది అందరికీ తెలిసిందే. ముద్రగడ దీక్షకు తెర వెనుక వైసీపీ మద్దతు ఇచ్చిందని అన్నివర్గాల నుంచి వినిపిస్తోంది.. కాపు సామాజిక వర్గానికి చేరువయ్యేందుకేన వైసీపీ మద్దతిచ్చిందన్న ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో వుంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలపర్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాటి కోసం తనవంతు సహకారం అందించి చివరకు సాధించింది ఏమిటన్నది ప్రస్తుతం ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది.

కాపు రిజర్వేషన్లను తొలి నుంచి బీసీలు వ్యతిరేకిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లను అమలు చేస్తే స్థానిక సంస్థల్లో తమకు అన్యాయం జరుగుతుందన్నది బిసి నేతల ఆరోపణ. రాష్ట్ర జనాభాలో సగం ఉన్నా బిసిల వాదన ఇలావుంటే టిడిపిని ఇరకాటంలోకి నెట్టేందుకు కాపు ఉద్యమానికి వైసీపీ మద్దతు ఇచ్చింది. తమ నేతలను కాపు ఉద్యమ నేతలవద్దకు పంపించి బహిరంగంగా మద్దతు తెలిపింది. టిడిపి సర్కార్ వెంటనే కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరింది. కానీ అనూహ్యంగా ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించి, టిడిపి సర్కార్‌ పై రిజర్వేషన్ల విషయంలో నమ్మకముందని ప్రకటించడంతో వైసీపీయే ఇరకాటంలో పడింది. కాపు సామాజిక వర్గానికి దగ్గరకు తీసుకొనేందుకు వీలుగా వారి రిజర్వేషన్లకు మద్దతు పలికి చివరకు బిసిలకు దూరం కావాల్సి వచ్చిందని వైసిపి నేతలు వాపోతున్నారు. కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకకపోయినా ఏమీ ఇబ్బంది ఉండేది కాదని... కానీ, ఇప్పుడు మద్దతు పలికి సాధించింది లేకపోగా కొత్తగా బీసీల్లో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ నేతలు బాధపడుతున్నారట. ఈ పరిణామాలు మున్ముందు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీగా బిసి సామాజిక వర్గం టిడిపి పక్షాన నిలిచిందని వారు గుర్తుచేస్తున్నారు. నష్టనివారణకు ఏం చేయాలా అని ఇప్పుడు వారు ఆలోచిస్తున్నారు.