Begin typing your search above and press return to search.

ఎవరెస్ట్..ఓ చెత్త‌కుప్ప‌

By:  Tupaki Desk   |   18 Jun 2018 5:17 AM GMT
ఎవరెస్ట్..ఓ చెత్త‌కుప్ప‌
X
65 ఏళ్ల‌ కిందట ఎడ్మండ్ హిల్లరీ - టెన్సింగ్ నార్గే తొలిసారి విజయవంతంగా ఎవరెస్ట్‌ను ఎక్కి రికార్డ్ సృష్టించారు. ఆ స్ఫూర్తితో అనేక మంది ఔత్సాహికులు - ప్ర‌కృతి ప్రేమికులు ఎవ‌రెస్ట్‌ ను అధిరోహిస్తున్నారు.అయితే, ఇది నాణానికి ఓ వైపే. ప్రకృతి అందాలకు.. సాహసయాత్రలకు నెలవైన ఎవరెస్ట్ శిఖరం చెత్తకుప్పగా మారుతోంది. పర్వతం పైకి వెళ్లే మార్గం లో ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఏటికేడు ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్యతోపాటు వారు వదిలేస్తున్న వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. దీంతో ఎవరెస్ట్ నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డంపింగ్‌యార్డుగా మారింది. ఎవరెస్ట్‌ పై పేరుకున్న వ్యర్థాలు మంచు లో కలుస్తున్నాయని - మంచు కరిగినప్పుడు కలుషిత నీరు ఉత్పత్తి అవుతున్నదని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు.

ఎవ‌రెస్ట్‌ పై పెద్ద ఎత్తున పెరిగిపోతున్న చెత్త సుంద‌ర హిహాల‌యాల‌ను క‌లుషితం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎవరెస్ట్‌ పై పోగయ్యే వర్థాలను తగ్గించేందుకు ఐదేళ్ల‌ కిందట నేపాల్ ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. పర్వతారోహకుల బృందం రూ.2.7 లక్షలు డిపాజిట్ చేయాలి. ఒక్కో సభ్యుడు తిరిగి వచ్చేటప్పుడు ఎనిమిది కిలోల చొప్పున వ్యర్థాలను తెస్తే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. టిబెట్ వైపు నుంచి ఎక్కేవారు కచ్చితంగా ఎనిమిది కిలోల వ్యర్థాలను తేవాలి. గత ఏడాది నేపాల్ నుంచి వెళ్లిన పర్వతారోహకులు 25 టన్నుల చెత్తను - 15 టన్నుల మానవ విసర్జితాలను తెచ్చారని సాగర్‌ మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ తెలిపింది.కానీ ఏటా ఎవరెస్ట్‌ పై పేరుకుపోతున్న వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నారు. డిపాజిట్ చేస్తున్న వారిలో సగం మందే వ్యర్థాలను తెచ్చి - డబ్బు వెనుకకు తీసుకుంటున్నారన్నారు. ఒక్కో బృందం ఎవరెస్ట్ పర్యటనకు రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు వెచ్చిస్తున్నారని.. వ్యర్థాల సేకరణకు చేసే డిపాజిట్ వారికి లెక్కలోకే రావడం లేదని చెప్పారు. రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్య పెరిగి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేస్తుండటంతో టన్నుల మేర పేరుకోవడం చాలా విచారకరం అని నేపాలీ షెర్పా పెంబా డోర్జే ఆవేదన వ్యక్తం చేశారు.