Begin typing your search above and press return to search.

భరత్ అనే నేను రిపీట్.. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఖతమే..

By:  Tupaki Desk   |   2 Aug 2019 4:43 AM GMT
భరత్ అనే నేను రిపీట్.. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఖతమే..
X
మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగికి 20వేల జరిమానా విధిస్తారు. ఓ చిరుద్యోగి తన నెలజీతాన్ని మొత్తం టాక్స్ గా కడితే ఎలా అని జనాలు - ప్రతిపక్షాలు గోల చేసినా సీఎం హోదాలోని మహేష్ మాత్రం అలా చేస్తేనే మన ట్రాఫిక్ వ్యవస్థ చక్కబడుతుందని సెలవిస్తాడు. ఇక సినిమా కాబట్టి అంతంత జరిమానాలు భరిస్తారని.. నిజజీవితంలో అది కష్టమని ఈ సినిమా ప్రమోషన్ కు వచ్చిన నాటి మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పుడది నిజమైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి గూబ గూయ్యిమనేలా కేంద్రం కొత్త చట్టాన్ని ఆమోదించింది. కేంద్రంలో రెండోసారి అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ మొత్తం వ్యవస్థల ప్రక్షాళన దిశగా చాలా బిల్లులను పార్లమెంట్ లో ఆమోదిస్తూ ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగా తెచ్చిందే ‘మోటార్ వెహికిల్ యాక్ట్’. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్న దృష్ట్యా మోడీ ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. పూర్వం ఉన్న చట్టానికి సవరణలు చేసిన ఈ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై పలు రాష్ట్రాలు ఆందోళనలు - అభ్యంతరం తెలిపినా కూడా కేంద్రం మాత్రం మొండిగా భారీ జరిమానాలతో ఈ బిల్లును పాస్ చేయించుకుంది.

*రాష్ట్రాలకే హక్కులు.. ఆదాయం..

ఈ బిల్లులో వాహన రిజిస్ట్రేషన్ చార్జ్ - అధికారుల పోస్టింగ్ - ఇతర ట్రాఫిక్ ఆదాయం రాష్ట్రాలకే కట్టబెట్టింది. డ్రైవింగ్ శిక్షణ సంస్థల ఏర్పాటు రాష్ట్రాల ఇష్టానికి వదిలేసింది.

*ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

ఈ కొత్త చట్టంలో ట్రాఫిక్ నేరాలకు కఠిన శిక్షలు అమలవుతాయి. భారీ జరిమానాలుంటాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి. తీవ్రంగా గాయపడితే రూ.2.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మోత మోగుతుంది. ఇదివరకు రూ.100 ఉన్న జరిమానాను ఇప్పుడు రూ.500కు పెంచారు. గరిష్టంగా 10000 వరకు పెనాల్టీ వేస్తారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే పెనాల్టీని రూ.500 నుంచి రూ5000కు పెంచారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 100 ఉన్న పెనాల్టీ రూ.1000కు పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెనాల్టీ రూ.2000 నుంచి రూ.10000కు పెంచారు. రాష్ డ్రైవింగ్ కు రూ.5వేల పెనాల్టీ విధించారు. ఇక అంబులెన్స్ లాంటి వాటికి దారి ఇవ్వకుంటే రూ.10వేల జరిమానా.. కార్ల వంటి వాహనాలు స్పీడ్ డ్రైవింగ్ కు రూ.1000 - హెవీ వెహికిల్స్ స్పీడ్ డ్రైవింగ్ కు రూ.2000 - రోడ్డుపై రేసింగ్ చేస్తే 5000 - వెహికిల్ ఇన్సూరెన్స్ కవరేజ్ గడువు ముగిస్తే రూ.2వేల జరిమానా విధిస్తారు.

*యాక్సిడెంట్ చేసి పరారైతే భారీ జరిమానా

యాక్సిడెంట్ చేసి పరారైన వాహనదారులకు ఇప్పుడున్న 25000 ఉన్న పెనాల్టీని రూ.2 లక్షలకు పెంచారు. గాయాలపాలైతే రూ.12500 చెల్లించగా.. దాన్ని ఇప్పుడు రూ.25వేల కు పెంచారు.

*ప్రమాద బాధితులకు ఉచిత చికిత్సకు ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితులకు ఎలాంటి కేసులు - విచారణ లేకుండానే ఆస్పత్రులు చేర్చుకొని డబ్బులు అడగకుండానే ఉచిత చికిత్స జరిగేలా కేంద్రం ఒక కొత్త స్కీం తీసుకొస్తోంది. ప్రమాదం జరిగిన గంట నుంచి ఈ స్కీం వర్తించేలా రూపొందించింది. ఈ ప్రమాద బాధితులకు క్లెయిమ్ కోసం ఆరు నెలల దాకా గడువు ఇచ్చింది. పిల్లలకు వాహనం ఇచ్చే యాక్సిడెంట్లు చేస్తే వాహన యజమాని, తల్లిదండ్రులకు శిక్షలు పడేలా చట్టాన్ని రూపొదించారు.