Begin typing your search above and press return to search.

మ‌హానాడు సాక్షిగా బాబుపై మోత్కుప‌ల్లి అసంతృప్తి

By:  Tupaki Desk   |   29 May 2016 4:04 AM GMT
మ‌హానాడు సాక్షిగా బాబుపై మోత్కుప‌ల్లి అసంతృప్తి
X
తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పండుగ‌ మహానాడులో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ మోత్కుపల్లి నర్సింహులు ప్ర‌సంగం తెలుగుదేశం నాయ‌కులంద‌రినీ కదిలించింది. ఆవేదనతో ఆయన మాట్లాడిన తీరుచూస్తే….పార్టీ తనను సరిగా చూసుకోవడంలేదన్న భావన కనిపించింది. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, ఎన్టీఆర్ ప్రోత్సహించిన తీరును మొదట మోత్కుపల్లి వివరించారు. ఆ తర్వాత ఎవరికిందా పనిచేయనని, చంద్రబాబుకే విధేయుడిగా ఉంటానని, తన విషయంలో వస్తున్న అసత్యప్రచారాన్ని నమ్మవద్దన్నారు. తనకు ఆరోగ్యం బాగుండడంలేదని, ఎన్నాళ్ళు ఉంటానో తెలియదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మిత్రుడే అయిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ కోసం ఆయనతో మొదటినుంచీ యుద్ధమే చేస్తున్నానన్నారు. తాను ఏపీ వాడిననుకుంటే ఏపీ అని.. లేదు తెలంగాణ వాడిననుకుంటే తెలంగాణవాడినని అన్నారు మోత్కుపల్లి.

అయితే మోత్కుపల్లి ఇంత ఆవేద‌న‌తో చేసిన కామెంట్ల‌ వెనక చాలానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండేళ్ల క్రితం మోత్కుపల్లికి గవర్నర్ గిరీ వచ్చేసినట్టేనని అందరూ భావించారు. గండిపేట తెలుగువిజయంలో జరిగిన ఆ మహానాడులో సాక్షాత్తు… చంద్రబాబే మోత్కుపల్లిని గవర్నర్ గారని సంబోధించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన దశ తిరిగినట్టేనని అందరూ అనుకున్నారు. మీడియాలో కూడా ఆ లెవల్లో ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్త ముచ్చటే అయ్యింది. ఆ తర్వాత చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. ఆ మాట వినపడలేదు. ఇక గవర్నర్ పదవిపై ఆశలు వదులుకున్న మోత్కుపల్లి… కనీసం రాజ్యసభ సీటైనా దొరుకుతుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. తన జీవితాంతం పార్టీకే పని చేశానని… నేను మీ వాడినని… పదేపదే మహానాడు వేదికపై చెప్పడం ద్వారా… ఈ విషయాన్ని చంద్రబాబుకు మోత్కుపల్లి తెలిసేటట్టు చేస్తున్నారంటున్నారు విశ్లేషకులు. ఆంధ్ర కోటాలోనైనా రాజ్యసభకు తనను పంపాలని ఇన్ డైరెక్టుగా చంద్రబాబును మోత్కుపల్లి కోరుతున్నట్టు చెబుతున్నారు.