Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఆస్తులు ఎక్క‌డున్నాయి?

By:  Tupaki Desk   |   14 Jun 2018 4:36 PM GMT
చంద్ర‌బాబు ఆస్తులు ఎక్క‌డున్నాయి?
X
టీడీపీ బ‌హిష్కృత నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మ‌రో మారు ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గస్థాయి ముఖ్య అనుచరులతో రాజకీయ భవిష్యత్తుపై ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక' సమావేశంలో - అనంత‌రం ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో - దీంతో పాటుగా విలేక‌రుల స‌మావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇన్నాళ్లు రాజ్యసభ - గవర్నర్‌ - రాష్ట్రపతి అభ్యర్థివంటూ ఆశలు చూపి దళిత జాతిని చంద్రబాబు అవమానపరిచాడన్నారు. రూ.100కోట్లతో విలాసవంతమైన గృహాన్ని నిర్మించుకుని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌ కు - విజయవాడకు తిరుగుతున్నాడని విమర్శించారు.

టీడీపీ పార్టీ ఎన్టీఆర్‌ వారసులకే దక్కాలని మోత్కుప‌ల్లి డిమాండ్ చేశారు. ``రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత ఒక్క చంద్రబాబునాయుడిదే. ఒక దళితుడిగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. దగ్గుబాటి వెంకటేశ్వరావు - హరికృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ - ముఖ్యమంత్రి కావాల్సిన బాలకృష్ణను నువ్వు ( చంద్రబాబునాయుడు) మోసం చేశావు - నందమూరి కుటుంబంలో ఎవరికి నువ్వు న్యాయం చేశావు? వాళ్లందరూ నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నీ కొడుకు - మనవడికీ కూడా రాజ్యాధికారం కావాలని నువ్వు కోరుకోవడం ఎంత వరకు సమంజసం? నందమూరి కుటుంబం కోసం ఏదైనా చేస్తాం. ఇప్పటికైనా సరే - నందమూరి కుటుంబంలో ఎవరైనా ‘ఈ జెండా మాది’ అని ముందుకొస్తే వాళ్ల వెంబడే తిరుగుతా.`` అంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

''ఒక్కో రాజ్యసభ సీటును కార్పొరేట్‌ వ్యక్తులకు వందకోట్ల రూపాయలకు అమ్ముకున్న దగాకోరు చంద్రబాబు. పదవి కోసం పిల్లనిచ్చిన మామ గొంతునే నులిమి చంపి..టీడీపీ జెండాను గుంజుకున్న నమ్మకద్రోహి చంద్రబాబు'' అంటూ మోత్కుప‌ల్లి తీవ్రస్థాయిలో విమర్శించారు. ``రాజ్యసభ సీటు ఇస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఈ సీటును టీజీ వెంకటేష్ కు వంద కోట్లకు నువ్వు అమ్ముకోలేదా? సీఎం రమేష్ దగ్గర నువ్వు తీసుకున్నావా? లేదా? గరికపాటి మోహన్ రావుకు నువ్వు డబ్బులు తీసుకోకుండా ఇచ్చావా?నువ్వు వేలం వేశావు.. వాళ్లు కొన్నారు. వేలం వేస్తామని బోర్డు పెడితే కొనుక్కోకుండా ఎవరుంటారు? `` అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్రబాబు కొడుకు రాజకీయ వ్యాపారం పెట్టారని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

చంద్రబాబునాయుడు సంపాదించినదంతా దుబాయ్ - సింగపూర్ - అమెరికాలో దాస్తున్నారని మోత్కుప‌ల్లి ఆరోపించారు. ``చంద్రబాబునాయుడు సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వయిరీ కనుక జరిపితే కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకొస్తుంది. కేంద్రం నిధులు 32వేల కోట్ల రూపాయలు అడ్డంగా దోచుకున్నాడు. చంద్రబాబు నాయుడు సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారు`` అని ఆరోపించారు. ఒకవేళ దొరికినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చున‌ని ఎద్దేవా చేశారు. ``చంద్ర‌బాబు నీకు దమ్మూధైర్యం ఉంటే.. ఆ స్టేలన్నింటినీ వెకేట్ చేయించుకో. చంద్రబాబు ఓపెన్ గా ముందుకు రావాలి. చంద్రబాబుపై ఇప్పటికే 29కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డితో సహా అడ్డంగా దొరికి తప్పించుకు తిరుగుతున్నారు`` అని వ్యాఖ్యానించారు.తెలంగాణ టీడీపీని నిలబెట్టేందుకు విస్తృత కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి...మాతోనే టీఆర్‌ ఎస్‌ పార్టీని తిట్టిపిస్తూ...తాను మాత్రం సీఎం కేసీఆర్‌ తో చెట్టాపట్టాలేసుకుని బాబు తిరుగుతున్నాడని విమర్శించారు.

వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ - కాంగ్రెస్‌ - కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్ర‌దేశ్‌ లో కొట్లాడుతుంటే చంద్రబాబు మాత్రం రంగులు మార్చుతూ సొంత లాభానికి ప్రత్యేక హోదాను నీరుగార్చడని మోత్కుప‌ల్లి దుమ్మెత్తిపోశారు. రాబోయో రోజుల్లో ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు తిరగబడతారు. కేసీఆర్‌ - జగన్‌ - పవన్‌ కళ్యాణ్‌ అసలైన మొగోళ్లని - చంద్రబాబు కాదు``అని అన్నారు. ఇంటికి వెళ్లి మ‌రీ మ‌ద్ద‌తు అడిగి గెలిచిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను అవ‌స‌రం తీరిన త‌ర్వాత ప‌క్క‌న‌పెట్టేశాడ‌ని మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు. మోడీని శంకుస్థాప‌న‌కు పిలిచి మ‌రీ అవ‌మానించార‌ని అన్నారు. మ‌హానాడుకు త‌న‌ను ఆహ్వానిస్తే..ఈ విష‌యాల‌న్నీ అక్క‌డే చెప్పేవాడిన‌ని మోత్కుప‌ల్లి వెల్ల‌డించారు.