Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ తిర‌గొచ్చాక‌!... టీడీపీకి ద‌బిడిదిబిడే!

By:  Tupaki Desk   |   19 Feb 2019 4:22 AM GMT
జ‌గ‌న్ తిర‌గొచ్చాక‌!... టీడీపీకి ద‌బిడిదిబిడే!
X
మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీకి దారుణ‌మైన ప‌రిస్థితి ఎదురు కానుంద‌న్న వార్త‌లు కాస్తంత బ‌లంగానే వినిపిస్తున్నాయి. గ‌డ‌చిన ఐదేళ్ల పాల‌న‌లో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరే ఇందుకు కార‌ణ‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఈ సారి కూడా గెలిచి తీరాల్సిందేన‌న్న టీడీపీ క‌ల.. క‌ల‌గానే మిగిలిపోవ‌డంతో పాటుగా ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీ చేతులెత్తేయ‌డం ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ నుంచి ఇద్ద‌రు ఎంపీలు - ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి, విప‌క్షం వైసీపీలో చేరిపోయారు. వారం రోజుల వ్య‌వ‌ధిలోనే వ‌రుస‌బెట్టి చోటుచేసుకున్న ఈ ప‌రిణామాలు టీడీపీకి భారీ షాకిచ్చాయ‌నే చెప్పాలి. మ‌రింత మంది టీడీపీ నేత‌లు పార్టీ మారుతున్నారంటూ వినిపిస్తున్న వార్త‌ల‌తో అస‌లు చంద్ర‌బాబుకు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ట‌.

మొత్తంగా ఇప్పుడు టీడీపీకి ఎదుర‌వుతున్న ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ ఎదురు కాలేద‌న్న విశ్లేష‌ణ‌లు ఆసక్తి రేపుతున్నాయి. ఇక ఇప్పుడే ప‌రిస్థితి ఇలా ఉంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ టూర్‌ ను ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారే ప్ర‌మాదం లేక‌పోలేద‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. లండ‌న్‌ లో విద్యాభ్యాసం చేస్తున్న త‌న కుమార్తెను చూసి వ‌చ్చేందుకు ఈ నెల 20న లండ‌న్ బ‌య‌లుదేర‌నున్న జ‌గ‌న్‌.. తిరిగి ఈ నెల 26న హైద‌రాబాదు చేరుకుంటారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే భారీగా చేరిక‌లు జ‌రిగిపోగా... వైసీపీలో చేరేందుకు స‌న్న‌ద్ధంగా ఉన్న ఇత‌ర టీడీపీ నేత‌లు... జ‌గ‌న్ రాగానే వైసీపీ కార్యాల‌యానికి క్యూ క‌ట్ట‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి వారి జాబితా చాలా పెద్ద‌గానే ఉందని తెలుస్తోంది. ఆ జాబితాలో ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలోనూ మంచి ప‌ట్టున్న టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి - క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి - ప్ర‌స్తుతం టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త టీజీ వెంక‌టేశ్‌ - తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు త‌దితర నేత‌లున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న‌ మాజీ ఎంపీ కావూరి సాంబ‌శివ‌రావు కూడా జ‌గ‌న్ రాగానే వైసీపీలోకి చేరిపోయేందుకు సిద్ధ‌మైన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న మాజీ ఎంపీ కిల్లి కృపారాణి కూడా జ‌గ‌న్ విదేశీ టూర్ ముగించుకుని రాగానే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కృపారాణి వైసీపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు ముగిశాయ‌ని - ఇరు వ‌ర్గాలు కూడా ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్టుగా కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా జ‌గ‌న్ ఫారిన్ టూర్ ముగించుకుని రాగానే... వైసీపీ కార్యాల‌యానికి కొత్త క‌ళ రానుండ‌గా - టీపీపీకి మాత్రం చావుదెబ్బ త‌ప్ప‌ద‌న్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.