Begin typing your search above and press return to search.

యూపీలో ఏకైక ముస్లిం మినిష్టర్ బ్యాక్ గ్రౌండేమిటి?

By:  Tupaki Desk   |   20 March 2017 5:02 AM GMT
యూపీలో ఏకైక ముస్లిం మినిష్టర్ బ్యాక్ గ్రౌండేమిటి?
X
అంత పెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ ముస్లింలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు..కానీ, మంత్రివర్గంలోకి మాత్రం ఒక ముస్లింను తీసుకున్నారు. టిక్కెట్లిచ్చేటప్పుడు ఒక్కరికి కూడా ఛాన్సివ్వకుండా మంత్రివర్గంలో మాత్రం ఛాన్సిచ్చారంటే.. ఆయన అంత గొప్ప రాజకీయ నాయకుడా..? అనుకుంటాం. కానీ, అదేమీ కాదు. మంత్రి పదవి దక్కించుకున్న ముస్లిం నేత ఒక మాజీ క్రికెటర్ మొహిసిన్ రాజా. ఆయన అడింది కూడా యూపీ తరఫున రంజీ క్రికెట్ మాత్రమే. ఇంటర్నేషనల్ స్టారేమీ కాదు. బీజేపీలో చేరి కూడా గట్టిగా నాలుగేళ్లయింది. 2013లో బీజేపీలో చేరిన ఆయనకు అధికార ప్రతినిధిగా నియమించారు. ఆ పోస్టులో బాగా రాణించడంతో పార్టీలో మంచి పేరు దక్కింది.

క్రికెట్ కెరీర్ కు, రాజకీయాలకు మధ్య కాలంలో ఆయన సామాజిక సేవాకార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఆ పునాదులపై బీజేపీలోనూ ఎదిగారు. యూపీలో క్రీడల అభివృద్ధిలోనూ ఆయన పాత్ర ఉంది.

అన్నిటికీ మించి సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ లను విమర్శించడంలో రాజా ఫ్రంట్ రన్నర్. ములాయం తన వ్యక్తిగత లబ్ధి కోసం ముస్లింలను వాడుకుంటున్నారని పదేపదే ఆరోపించిన నేత రాజా.

ముస్లింలకు టిక్కెట్లివ్వకుండానే భారీ విజయాన్ని అందుకున్న బీజేపీ ఇప్పుడు దాన్ని కవర్ చేసేందుకు మొహిసిన్ రాజాకు మంత్రి పదవి ఇచ్చింది. అయితే.. ఆయన ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ కాకపోవడంతో ఆర్నెల్లలో ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. మరోవైపు అనంతర కాలంలో యోగి కేబినెట్ ను విస్తరిస్తే ఒకరిద్దరు ముస్లిం నేతలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వరకు అగ్రెసివ్ గా వెళ్లినా తరువాతైనా వారిని మరింత చేరువ చేసుకోవాలన్నది యోచన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/