Begin typing your search above and press return to search.

మహిళా సర్పంచ్ కు మోహన్ బాబు ప్రశంసలు

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:49 AM GMT
మహిళా సర్పంచ్ కు మోహన్ బాబు ప్రశంసలు
X
పొరుగు రాష్ర్టాలైన తెలంగాణ‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ల మ‌ధ్య సన్నిహిత సంబంధాల‌కు ఓ మ‌చ్చుతున‌క వంటిది ఈ సంద‌ర్భం. తెలంగాణ రాష్ట్రం ఆడ‌ప‌డుచు పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్రదేశ్‌ లో స‌ర్పంచ్ అయ్యారు. అది కూడా ఏపీ ముఖ్య‌మంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో కావ‌డం విశేషం. ఇంతేకాకుండా స‌ద‌రు మ‌హిళామ‌ణి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆ గ్రామం అభివృద్ధిప‌థంలో ముందుకుపోతున్న‌దని ఏకంగా ఓ అగ్ర‌హీరో అభినంద‌న‌లు తెలిపారు. ఇన్ని విశేషాల‌కు వేదిక అయిన‌ ఆ ఊరు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లి. ఆ గ్రామ ప్ర‌థ‌మ పౌరురాలు కొటాల పద్మజ. ఆమెను ప్రశంసించిన అగ్ర‌హీరో డైలాగ్‌ కింగ్ మోహన్ బాబు!

ఇంత‌కీ మోహ‌న్‌ బాబు ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? ఆ స‌ర్పంచ్‌ ను అభినందించేంద‌కు వ‌చ్చిన సంద‌ర్భం ఏమిట‌నే క‌దా మీ ఆస‌క్తి. త‌మిళ‌నాడు సంప్ర‌దాయ క్రీడ అయిన జల్లికట్టు ప్రదర్శనను రామిరెడ్డిపల్లిలో తాజాగా నిర్వహించారు. ఈ సంబురానికి హీరో మోహన్ బాబు, ఆయన కుమారుడు యువ హీరో మంచు మనోజ్, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి హాజరై గ్రామస్తులతో కలసి జల్లికట్టు ప్రదర్శనను తిలకించారు.ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌ బాబు స‌ర్పంచ్ ప‌ద్మ‌జ‌ను కొనియాడారు. తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్ కు కోడలుగా వచ్చి, సర్పంచ్ గా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారంటూ అభినందించారు.

ఈ సంద‌ర్భంగా జ‌ల్లిక‌ట్టు గురించి కూడా మోహ‌న్‌ బాబు స్పందించారు. ఆవులను, జంతువులను హింసించరాదనేది త‌న సిద్ధాంత‌మ‌ని చెప్పారు.

అయితే జంతువుల‌ను హింసించ‌కుండా ఈ త‌ర‌త‌రాల సంప్ర‌య‌దాయాన్ని పాటించ‌డంలో త‌ప్పేమీ లేద‌న్నారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌ రెడ్డి సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ పశువులను హింసించకుండా జల్లికట్టును కొన‌సాగించ‌వ‌చ్చని చెప్పారు.