Begin typing your search above and press return to search.

మోస్ట్ డేంజరస్ సిట్యుయేషన్ లో మోడీ?

By:  Tupaki Desk   |   29 July 2016 9:35 AM GMT
మోస్ట్ డేంజరస్ సిట్యుయేషన్ లో మోడీ?
X
భారత ప్రధాని నరేంద్ర మోడీకి పెను ప్రమాదం ముంచి ఉందని నిఘా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై డ్రోన్‌ లతో దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. లష్కరె తొయిబా - జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నట్టుగా సమాచారం ఉండడంతో అప్రమత్తమయ్యారు.

ఆగస్టు 15 ఉదయం ఎర్రకోట బురుజుల నుంచి ప్రధాని ప్రసంగించే సమయంలో డ్రోన్‌ లతో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ ఐ మద్దతుతోనే ఈ రెండు ఉగ్రవాద గ్రూపులు ఈ దాడికి పన్నాగం పన్నుతున్నట్టుగా ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. భారత్ - పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణను బట్టి ఇంటిలిజెన్స్ వర్గాలు వారి కుట్రను వెలుగులోకి తెచ్చాయి. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే ఉగ్రవాదులు ఈ దాడులకు ఒడిగట్టే అవకాశం ఉందని ఇందులో భాగంగా భద్రత దళాలపైనా - సైనిక శిబిరాలపైనా కాన్వాయ్‌లపైన కూడా విరుచుకుపడేందుకు సిద్ధపడుతున్నట్టుగా గూఢచారి వర్గాలు సమాచారాన్ని సేకరించాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగించే ఎర్రకోట ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రధానికి వ్యక్తిగత భద్రత అందించే ఎస్‌పిజి దళాలను కూడా మరింత అప్రమత్తం చేశారు. అలాగే ఎర్రకోట సమీపంలోని అన్ని ప్రాంతాల్లోనూ అత్యంత శక్తివంతమైన కెమెరాలను అమర్చడం ద్వారా ప్రతిఒక్కరి కదలికపైనా డేగ కన్నువేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కవరేజిలోనూ కనీసం డ్రోన్ కెమేరాలు కూడా కనిపించకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.