Begin typing your search above and press return to search.

పాక్‌ తో కాంగ్రెస్‌..మోడీకి పంచ్ వేసిన ఓవైసీ

By:  Tupaki Desk   |   12 Dec 2017 4:48 AM GMT
పాక్‌ తో కాంగ్రెస్‌..మోడీకి పంచ్ వేసిన ఓవైసీ
X
గుజరాత్‌ రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ ఎన్నికలలో బీజేపిని ఓడించడానికి కాంగ్రెస్‌ పాకిస్తాన్‌ తో చేతులు కలిపిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అనూహ్య రీతిలో కౌంట‌ర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు కొందరు పాకిస్తాన్‌ తో కలిసి గుజరాత్‌ లో బీజేపిని ఓడించడానికి కుట్రపన్నుతున్నారని ప్రధానమంత్రి చేసిన ఆరోపణలపై అసదుద్దీన్‌ స్పందించారు. ఆయన సోమవారం ఎఎన్‌ ఐ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అన్నారు. పాకిస్తాన్‌ తో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడినవారు ఎంతటివారినైనా ఉపేక్షించరాదని అన్నారు.

ఒక‌వేళ మోడీ నిజంగా నమ్మితే తన పర్యవేక్షణలోని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ ఐఎ)తో దర్యాప్తునకు ఆదేశించాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు. `రుజువులుంటే దోషులను అరెస్ట్‌ చేయవచ్చు కదా? మరి ఇంత పెద్దనేరం చేస్తుంటే ప్రధాని చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేసే ఎన్‌ ఐఎ తో విచారణకు ఆదేశించవచ్చు అని వివ‌రించారు. నిర్ధిష్టమైన ఆధారాలుంటే జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్‌ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని తన మాటలకు రుజువులు చూపాలని సూచించారు.

ఇదిలాఉండ‌గా.... ఆదివారం పాలన్పూర్‌ లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆ కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాక్ అధికారులతో భేటీ అయ్యారు. దీనికి పాక్ హైకమిషనర్ - పాక్ మాజీ విదేశాంగశాఖ మంత్రి - భారత మాజీ ఉపరాష్ట్రపతి - మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ హాజరయ్యారు. తర్వాతీ రోజే అయ్యర్ నన్ను నీచుడు అని అన్నారు. ఇది చాలా గంభీరమైన అంశం అని అన్నారు. దీనిపై ఆ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ ను గుజరాత్ సీఎం చేయాలని పాక్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ (డీజీ) సర్దార్ అర్షద్ రఫీక్ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారని ప్రశ్నించారు.

గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు పాక్ విదేశాంగ కార్యదర్శిని కలిశారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ విమర్శలకు కౌంటర్‌ గా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. యాభై ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తన ట్రాక్ రికార్డ్ ప్రజలందరికి తెలుసని మన్మోహన్ అన్నారు. తన రాజకీయ నిబద్ధతను ప్రశ్నించే హక్కు మోడీ సహా ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి లబ్ధి పొందే వ్యక్తిని కాదని మన్మోహన్ తేల్చిచెప్పారు. పాక్ అధికారులతో జరిగిన సమావేశంలో గుజరాత్ ఎన్నికలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. మణిశంకర్ అయ్యర్ ఏర్పాటు చేసిన డిన్నర్ లో కేవలం మర్యాదపూర్వకంగానే ఆ సమావేశం జరిగినట్లు చెప్పారు. భారత-పాకిస్థాన్ సంబంధాలపై మాత్రమే చర్చ జరిగిందని - అనేక మంది అతిథులు - జర్నలిస్టులు ఆ సమయంలో అక్కడే ఉన్నారని మన్మోహన్ వివరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ పాక్ తో అవంభిస్తున్న విధానాలపై మన్మోహన్‌ సింగ్ పలు ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదంతో రాజీ పడింది ఆయనే అన్నారు. ఉధంపూర్ - గురుదాస్ పూర్ లలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత కూడా ఆహ్వానించకుండానే పాకిస్థాన్‌ ఎందుకు వెళ్లారో మోడీ చెప్పాలన్నారు. యురి ఉగ్రదాడి తర్వాత పాక్ ఐ.ఎస్‌.ఐ ని ఏ విధంగా మన ఎయిర్ బేస్ లోకి అనుమతించారని నిలదీశారు.