Begin typing your search above and press return to search.

ఇప్పుడు వెనక్కి తీసుకుంటే ఏం లాభం మోడీ?

By:  Tupaki Desk   |   4 Aug 2015 4:21 AM GMT
ఇప్పుడు వెనక్కి తీసుకుంటే ఏం లాభం మోడీ?
X
ప్రధాని మోడీ చాలా తెలివైన వ్యక్తి అని.. రాజకీయ ప్రత్యర్థులకు ఏ అవకాశం ఇవ్వరని.. ఆయన కాని ఒక్కసారి ఫోకస్ చేస్తే.. చేసేందుకు ఏమీ మిగలదని మోడీ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు. నిజానికి మోడీ దగ్గర అంత సీన్ ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేసే వాళ్లు ఉన్నారు. అలా అని నచ్చక పోతే.. విపరీతంగా విమర్శలు చేసేయటం.. అస్సలు చేతకానివాడిగా చూపించటం అనేది ఒక పద్ధతిగా మారిన కాలంలో.. ఏ నేత గురించి ఏం చెప్పినా దాన్ని అనుమానంగా.. సందేహంగా చూడటం ఎక్కువైంది.

మోడీ తెలివితేటల్ని తక్కువ చేసి చూపించటం కాదు కానీ.. చేతికి అపరిమిత అధికారం వచ్చిన తర్వాత.. ఒక ధీమా వచ్చేస్తుంది. చుట్టూ ఉండే వారి మాటల ప్రభావం ఉండనే ఉంటుంది. ఇలాంటి సమయంలో.. వాస్తవానికి కాస్తంత దూరం జరుగుతుంటారు. ఎంతటి ప్రముఖుడికైనా ఇలాంటి ఇబ్బంది తప్పదు. ఇందుకు మోడీ కూడా మినహాయింపు ఏమీ కాదు.

ఇందుకు నిదర్శనంగా భూ సేకరణ బిల్లు ఉదంతమే. యూపీఏ సర్కారు తీసుకొచ్చిన ఈ బిల్లులో కొన్ని మార్పులు చేర్పులుచేయటంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. దాన్ని తనకున్న అధికార బలంతో ఆమోదించాలని మోడీ ఎంతగానో ప్రయత్నించారు. ఇందుకోసం ఎన్నో ఎత్తులు వేశారు. అయినా.. వాటిల్లో ఆయన విఫలమయ్యారు.

భూసేకరణ బిల్లులో చేసిన మార్పుల్లో కొన్ని.. బీజేపీని.. మోడీని అమితంగా ఆరాధించేవారు సైతం వ్యతిరేకించేవే. బీజేపీ తీసుకొచ్చిన తాజా మార్పులు కానీ చట్టబద్ధం కానీ అయితే.. పెట్టుబడిదారులు.. బడా వ్యాపారవేత్తల ప్రయోజనాలు మాత్రమే నెరవేరుతాయి తప్పించి.. సామన్యులకు మరిన్ని కష్టాలు తప్పవు. అయితే.. దీనిపై విపక్షాలు చేసిన నిర్మాణాత్మకమైన సూచనల్ని.. మోడీ సర్కారు తనకున్న అధికార బలంతో ఒప్పుకునేందుకు ఈగో అడ్డు వచ్చింది.

అయితే.. ఎంతకూ విపక్షాలు తన మాటను వినకపోవటం.. తన ఎత్తులు పారకపోవటంతో మోడీ సర్కారు దిగి వచ్చింది. వివాదాస్పద అంశాల్ని మినహాయించేందుకు ఒప్పుకుంది. సర్కారు ఏర్పడిన తర్వాత ఇంత రచ్చ జరిగిన తర్వాత నిర్ణయం మార్చుకునే బదులు.. మొదటే ఈ తెలివి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.

భూసేకరణ బిల్లును యూపీఏ సర్కారు నాటి విధానాల్నే యథాతధంగా ఉంచటం అంటే.. విపక్షాలు విజయం సాధించటమే కాదు.. తనకు తిరుగులేదన్న మోడీ అండ్ కో కాస్త వెనక్కి తగ్గారన్న విషయం మర్చిపోకూడదు. యూపీఏ విధానాల్ని యథాతధంగా అనుసరించాలని మోడీ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకున్న దానికి మరో విశేషం కూడా ఉంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ చేసిన ఆందోళన విజయవంతం అయినట్లేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన మొండితనంతో ప్రత్యర్థికి విజయాన్ని చేకూర్చిన మోడీని తెలివైనవాడని అనాలా..?