Begin typing your search above and press return to search.

మోడీ-ట్రంప్ భేటీ, ఏపీకి లాభ‌మేంటి?

By:  Tupaki Desk   |   26 Jun 2017 5:20 AM GMT
మోడీ-ట్రంప్ భేటీ, ఏపీకి లాభ‌మేంటి?
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ - మ‌న ప్రధాని నరేంద్రమోడీ భేటీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాలను అటెన్ష‌న్ మూడ్‌ లోకి తీసుకుపోయిన సంగ‌తి తెలిసిందే. రెండు బ‌ల‌మైన దేశాల అధినేత‌లుగా ఈ ఇద్ద‌రి భేటీలో వెలువ‌డే నిర్ణ‌యం ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌ను సైతం ప్ర‌భావితం చేయ‌నుండ‌ట‌మే ఈ స్థాయిలో శ్ర‌ద్ధ‌కు కార‌ణం. అయితే ఈ ప‌ర్య‌ట‌న కార‌ణంగా ఏపీకి సంబంధించిన కీల‌క ప‌రిణామాంపై కూడా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. అదే కొవ్వాడ‌లో అణు రియాక్ట‌ర్ నిర్మాణం.

రెండ్రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్‌ చేరుకున్న ప్రధాని మోడీ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో భేటీ అవనున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నేతల వ్యూహాత్మక చర్చల్లో కొవ్వాడ అణు రియాక్టర్ల పురోగతిపై చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో ఆరు పవర్‌ రియాక్టర్లను నిర్మించడానికి ఎన్పీసీఐ ఎల్‌ - వెస్టింగ్‌ హౌస్‌ మధ్య సంతకాలు జరిగే అవకాశముంది. 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ - అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ ఆధ్వర్యంలో అమెరికా- భారత్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా అణు సహకారంపై సంయుక్త ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత్‌ నాన్‌ ప్రొలిఫరేషన్‌ ట్రీటీ (ఎన్‌ పీటీ)పై సంతకం చేయకపోయినా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నట్లుగానే భావించడం జరుగుతుంది. ఈ ఒప్పందం ద్వారా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి భారత్‌ చేస్తున్న కృషిని అమెరికా ప్రపంచ దేశాలకు చాటిచెబుతుంది. వెస్టింగ్‌ హౌస్‌ ఆర్థిక సంక్షోభం - అణుశక్తి కర్మాగారం ఏర్పాటు చేసిన అనుభవం లేకపోవడంతో అమెరికాతో అణుఒప్పందంపై సంతకం చేసేందుకు అణువిద్యుత్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్పీసీఐఎల్‌) విముఖత చూపిస్తోంది.

అయితే 2015లో ప్రధాని మోడీ అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉమ్మడి ప్రకటన ప్రకారం ఇరు పక్షాలు 2017 జూన్‌ నాటికి ఒప్పందాన్ని ఖరారు చేయాలని నిర్ణయించాయి. ఆ తర్వాత దీనిపై అనేక చర్చలు జరిగాయి. జపాన్‌కు చెందిన తొషిబా కొనుగోలు చేసిన వెస్టింగ్‌ హౌస్‌ 2007 మార్చిలో బ్యాంకు రుణం చెల్లించడంలో చేతులెత్తేసి దివాలా కోసం దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు వచ్చేవరకు అణు ఇంధన శాఖ (డీఎఎఈ) - ఎన్పీసీఐఎల్‌ ఇబ్బందులతో సతమతమయ్యే సంస్థతో ఏ ఒప్పందాన్ని కూడా కొనసాగించేందుకు ఆసక్తి కనబర్చలేదు.

ఆంధ్రప్రదేశ్‌ - గుజరాత్‌ లో ఆరు పవర్‌ రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు వెస్టింగ్‌ హౌస్‌ - జీఈ హిటాచీలు 2008లో ఇండో-యూఎస్‌ అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొదట గుజరాత్‌ లోని మితి విర్ది ప్రాంతాన్ని వెస్టింగ్‌ హౌస్‌ కు కేటాయించగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ ప్రదేశాన్ని కేటాయించారు. ఒప్పందం ప్రకారం కంపెనీ కొవ్వాడలో ఆరు ఏపీ-1000 అణు రియాక్టర్లను 1,208 మెగావాట్ల శక్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయాలి. దీంతో మొత్తం 7,248 మెగావాట్ల సామర్థ్యం కలుగుతుంది. దక్షిణాసియాలోనే ఇది అతిపెద్ద అణు పార్క్‌గా మారనుంది. ఈ ప్లాంట్ విష‌యంలో తాజాగా ట్రంప్‌-మోడీ భేటీలో క్లారిటీ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/